ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 48,313 నమూనాలను పరీక్షించగా.. 137 మంది కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,86,694కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో నలుగురు మరణించారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 7146కి చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 167 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,78,060కి చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1488 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,27,87,961 నమూనాలను పరీక్షించారు.
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 15, చిత్తూరులో 12, తూర్పుగోదావరిలో 17, గుంటూరులో 16, కడపలో 4, కృష్ణాలో 17, కర్నూలులో 8, నెల్లూరులో 6, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 5, విశాఖపట్నంలో 17, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు దేశంలోనూ కొత్త కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 14,545 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 163 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,53,032కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1.88 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. జనవరి 21న 8,00,242 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.