ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, కృష్ణాలో అధికం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే, పాజిటివ్ కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 66,778 కరోనా పరీక్షలను నిర్వహించగా 1395 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కరోనా బులిటెన్ను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.
ఏపీలో కొత్తగా 1395 కరోనా కేసులు
కొత్తగా నమోదైన 1395 కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,56,159కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 9 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6890కి చేరింది. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.
16వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
గత 24 గంటల వ్యవధిలో 2293 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,32,284కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 92,64,085 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
కర్నూలులో అత్యల్పం.. కృష్ణాలో అధికం
ఇక జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 58, చిత్తూరులో 137, తూర్పుగోదావరిలో 214, గుంటూరులో 199, కడపలో 52, కృష్ణాలో 260, కర్నూలులో18, నెల్లూరులో 32, ప్రకాశంలో 31, శ్రీకాకుళంలో 37, విశాఖపట్నంలో 75, విజయనగరంలో 35, పశ్చిమగోదావరిలో 247 కేసులు నమోదయ్యాయి.
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 88,78,966 కరోనా కేసులు నమోదు కాగా, 82,93,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 1,30,613 మంది మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,53,040 యాక్టివ్ కేసులున్నాయి.