ప్రమాదం: ఒకే కుటుంబంలో 6 గురు, మృతులు వీరే...
రాజమండ్రి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న వారిని కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గాయపడిన వారిలో ఓనరాసి దుర్గాదేవి, ఓనరాసి వెంకటరత్నం, తాటికాయల రాజ్యలక్ష్మి, రాయుడు సూర్యనారాయణ, పెద్దిరాజు, జోనం రత్నకుమారి, పల్లాలమ్మలతో పాటు చిన్నారులు మధుసూదన్ (9), జ్యోత్స్నాదేవి (8), మోహన కృష్ణ (7), కాశీ చిన్నా (18 నెలలు), జ్యోత్స దేవి (8) ఉన్నారు.
మృతి చెందిన వారు..
వానరాశి నాగేశ్వర రావు, రుద్ర నాగవేణి, రాజు, సత్యవతి, మద్దాల కాంత బాలాజీ, గోపిరెడ్డి విజయతేజ, వానరాశి ఆదినారాయణ, నర్సింహ మూర్తి, శ్రీలక్ష్మిలు ఉన్నారు. వీరితో పాటు హోటల్ నడుపుతున్న ఒకే కుటుంబం మృతి చెందింది. వారు గడికంటి వాసు, మధు, అనంతలక్ష్మి, కోకిల, బాల సుజిత, సాయి గణేష్.
బాబు, వెంకయ్య వస్తున్నారు: దేవాదాయ శాఖ మంత్రి
ప్రమాదం ఘటన తెలియగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు వస్తున్నారమని ఏపీ మంత్రి మాణిక్యాల రావు అన్నారు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదం దారుణమని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. పూర్తి సమాచారం తెలుసుకుంటామన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. మరో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి సమీక్షిస్తున్నారు.