11 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్...22 దుంగలు, రూ.లక్ష స్వాధీనం
కడప : కడప జిల్లా రైల్వే కోడూరులో 11మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పి లక్ష్మీనారాయణ తెలిపారు. స్మగర్ల అరెస్ట్ కు సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి తెలిపారు.
కోడూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని కోడూరు ఓబులవారిపల్లె చిట్వేలి మండలాలలో ఎర్రచందనం స్మగ్లర్ల సంచారం గురించి తెలిసి దాడులు నిర్వహించామని డిఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో 11మంది స్మగ్లర్లతో పాటు కారు రెండు మోటార్ సైకిళ్లు, లక్ష రూపాయల నగదు 22 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పట్టుబడిన వారిలో కొందరు ప్రొఫెషనల్ వుడ్ కట్టర్లని తెలిసింది. వీళ్లు చెట్లు నరకడం, డ్రెస్సింగ్ చేయడంలో దిట్టలు కాబట్టి వారిని ఎన్నుకుని శేషాచలం వైపు మళ్ళించినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం కూలీలను ధర్మపురి, ఊటి, జవ్వాది మలై...పోరూరు వంటి ప్రాంతాల బాగా ఎక్కువ కూలీ ఇస్తామని చెప్పి తీసుకువచ్చారని సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మగ్లింగ్ అరికట్టడానికి తమిళనాడులోని రాయవేలూరు, తదితర ప్రాంతాలలో అవగాహనా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. అయినా స్మగ్లింగ్ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టడం లేదు.