14 నెలల్లో 59 వేల కోట్ల వ్యయం, దేశ చరిత్రలో ఇదో రికార్డు, బాబు 14 ఏళ్లలో ఏం చేశారు: విజయసాయిరెడ్డి
14 నెలల్లో ఏం చేయలేదని, రాజధాని తరలింపు కోసం పాటుపడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తోన్న సమయంలో అధికార వైసీపీ లెక్కల చిట్టాలతో సహా ప్రజల ముందుకు వచ్చింది. అధికారం చేపట్టినప్పటీ నుంచి ఇప్పటివరకు వెచ్చించిన వ్యయాన్ని అంకెలతో సహా వివరించింది. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఇందుకు సంబంధించి అంశాలతో కూడిన చిట్టాను ట్వీట్ చేశారు. చంద్రబాబు గత 14 ఏళ్లలో మీరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
14 నెలల్లో చేసిందిదీ..
పేదల అభ్యున్నతే ప్రభుత్వ ఉద్దేశం అని ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 14 నెలల్లో పేదల కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని వివరించారు. బడుగు, బలహీనవర్గాల కోసం రూ.59,425 కోట్లు ఖర్చు చేశామన్నారు. 73 ఏళ్ల స్వతంత్ర దేశ చరిత్రలో ఇదొ రికార్డు అని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాలనలో ఈ విధంగా చేశారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఖర్చుచేస్తే లెక్కలు విడుదల చేయాలని సవాల్ విసిరారు.
బడుగు, బలహీనవర్గాల కోసం..
బీసీలకు వైఎస్ఆర్ వాహనమిత్ర కింద లక్ష 17 వైల పైచిలుకు మందికి రూ. 224 కోట్లు, 61 వేల పైచిలుకు ఎస్సీలకు రూ.116.78 కోట్లు, 10 వేల పైచిలుకు ఎస్టీలకు రూ.19.03 కోట్లు, 29 వేల పైచిలుకు మైనార్టీలకు రూ. 56 కోట్లు, 29 వేల పైచిలుకు కాపులకు రూ.57 కోట్లను వెచ్చించామని తెలిపారు. వాహనమిత్ర కింద 2.62 లక్షల మందికి రూ. 502.43 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
రైతు భరోసా కోసం.. పెన్షన్ కానుక..
వైఎస్ఆర్ రైతు భరోసా, అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం రూ.10 వేల కోట్లకు పైగా చెల్లించామని విజసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఒడి, లా నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81 వేల పై చిలుకు మందికి రూ. 362 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మత్స్యకార భరోసా కింద లక్ష పైలుకు మందికి రూ.211 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
మొత్తంగా 59 వేల కోట్లు వ్యయం
అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్య దివేన, విదేశీ విద్యా విధానం, ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కోసం 16 వేల పైచిలుకు మందికి రూ.904 కోట్లు ఖర్చు చేశారు. వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెంట్స్, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, హౌస్ సైట్స్, వైఎస్ఆర్ చేయూత పథకాల కింద పలువురికి నగదు అందజేశామని తెలిపారు. వైఎస్ఆర్ కంటి వెలుగు కింద 67 లక్షల పైచిలుకు మందికి రూ.53 కోట్ల వెచ్చించారు. మొత్తంగా 4 కోట్ల 82 లక్షల 28 వేల 42 మందికి రూ.59 వేల 425 కోట్ల 49 లక్షలను ఖర్చు చేశామని వివరించారు.