‘అనంతపురం’ మృత్యుఘోష: 14మందికి చేరిన మృతులు
అనంతపురం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృత్యుఘోష కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు 9మంది మృతి చెందగా, బుధవారం అర్ధరాత్రి వరకు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 14కు చేరింది.
మొదట 9మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాములోపు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బుధవారం సాయంత్రం చికిత్స పొందుతున్న మరో మహిళ మృతిచెందింది. కాగా, బుధవారం అర్ధరాత్రి వరకు మరో నలుగురు రోగులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 14కి చేరింది. వీరందరివీ సాధారణ మరణాలేనని, పరిస్థితి విషమించడంతోనే వారు మృతిచెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథం తెలిపారు.
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పెనువిషాదం: 9మంది మృతి
ప్రధానంగా గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్య, రక్తహీనత, టీబీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు మృతిచెందారని జగన్నాథం తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది నగరంలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారని చెప్పారు. పరిస్థితి విషమించడంతో ఆఖరు క్షణాల్లో ఆయా ఆస్పత్రులు ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నాయని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా ఒకేరోజు ఇన్ని మరణాలు సంభవించలేదని తెలిపారు.
సూపరింటెండెంట్తో మాట్లాడిన సునీత
ఆస్పత్రిలో వరుస మరణాల ఘటనపై జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత స్పందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథంతో మాట్లాడారు. ఏఎంసీ విభాగంలో వైద్యసేవలు మెరుగుపరచాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, జిల్లా కలెక్టర్ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.