కన్న తల్లి రూ. 15 ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న బాలుడు
హైదరాబాద్: తాను అడిగిన రూ. 15 కన్న తల్లి ఇవ్వలేదని కోపంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మంగాయామ్మరావుపేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంగాయామ్మరావుపేటకు చెందిన పెరుమాళ్ల కుమారి, ఆమె భర్త రోజు వారి కూలీలు.
కూలీ పనుల్లో భాగంగా భర్త రోజు మాదిరిగానే కూలిపనికి వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చారు. ఈ సమయంలో వీరి కుమారుడు రాజేష్ (11) తనకు రూ. 15 కావాలని తల్లిని అడిగాడు. అయితే ఆ డబ్బుని తల్లి ఇచ్చేందుకు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన రాజేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ఆసుపత్రికి తరలించారు.
పోకిరీల వేధింపులు: యువతి ఆత్మహత్య
ఓ యువకుడి ఆగడాలు భరించలేక ఓ యువతి బుధవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురానికి చెందిన దంగోటి పద్మజ(19)కు ఇటీవల వివాహమైంది.
ఆషాఢమాసం కావడంతో పద్మజ పుట్టింటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రసాద్ ఆమెను ఫోన్ చేసి వేధిస్తున్నాడు. మంగళవారం భర్త సతీష్ ఇంటికి వచ్చిన సమయంలో కూడా ఫోన్ చేసి వేధిస్తుండటంతో పద్మజ భర్త ఆరా తీశాడు.
ఈ ఫోన్ విషయమై గ్రామానికి చెందిన పెద్ద పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్దల వాదనలు విని మనస్తాపంతో పద్మజ ఇంటిలోకి వెళ్లి ఎలుకల మందు తాగింది. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.