బావిలో పడ్డ అమ్మాయి, రెండ్రోజులు అందులోనే: ఆసుపత్రిలో పాములు, పరుగులు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బావిలో పడిన అమ్మాయి... ఎవరూ గుర్తించక పోవడంతో అందులోనే రెండు రోజులు ఉన్న సంఘటన వెలుగు చూసింది. ఆమెను మంగళవారం ఉదయం పోలీసులు రక్షించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రెండు రోజుల క్రితం పద్నాలుగేళ్ల బాలిక బావిలో పడింది. అయితే, ఆమెను ఈ రెండు రోజుల పాటు ఎవరూ గుర్తించలేదు. దీంతో, 48 గంటల పాటు అందులోనే ఉండిపోయింది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న ఓ యువకుడు బాలిక బావిలో ఉన్న విషయాన్ని గుర్తించాడు.
ఈ విషయాన్ని స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి బాలికను రక్షించారు. స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
కాగా, బావిలో పడిన బాలిక మోడల్ కాలనీకి చెందిన వారు. ఆమె ఇరవై అడుగుల లోతులో గల బావిలో పడింది. అయితే, ఈ బాలిక అనుకోకుండా అందులో జారిపడిందా? లేక ఎవరైనా తోశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
పరుగులు పెట్టిన డాక్టర్లు, పేషెంట్లు
ఆసుపత్రిలోకి వచ్చిన పాములు అందర్నీ హడలెత్తించాయి. చిత్తూరు పట్టణం మిట్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది జరిగింది. సోమవారం ఉదయం ఓపీ విభాగం ప్రారంభం అయిన సమయంలో... రెండు పాములు లోపలికి ప్రవేశించాయి.
వీటిని గమనించిన వెంటనే అక్కడ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లు అందరూ పరుగు లంఘించుకున్నారు. పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రెండు పాములను పట్టుకున్నారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.