రాజధాని రచ్చ: కొనసాగుతున్న బంద్.. దేవినేని ఉమా అరెస్ట్: అమరావతిలో 144 సెక్షన్..!
రాజధాని పైన ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన..అమరావతిలో ప్రకంపలనకు కారణమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కుటుంబాలతో కలసి రోడ్డెక్కారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు. దుకాణాలు..వాణిజ్య సముదాయాలు మూత బడ్డాయి. సచివాలయం వైపు వెళ్లే బస్సులను అడ్డుకుంటున్నారు. ఉద్యోగులను సైతం ఆపే ప్రయత్నం చేసారు.
అనేక చోట్ల మహిళ లు సైతం రోడ్ల పైన బైఠాయించారు. రాజధాని పైన సీఎం ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి పైన బైఠాయించిన మాజీ మంత్రి దేవినేని ఉమా ను పోలీసులు అరెస్ట్ చేసారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ పాటుగా యాక్ట్ 30 అమలు చేస్తున్నారు.
పెస్టిసైడ్స్ బాటిళ్లతో నిరసన..
ముఖ్యమంత్రి మూడు రాజధానుల గురించి చేసిన ప్రకటన అమరావతిలో ఆందోళనకు కారణమైంది. అక్కడి రైతులు..స్థానికులు రోడ్డ పైకి వచ్చి నిరననకు దిగారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేస్తున్నారు. మొత్తం 29 గ్రామాల్లోనూ బంద్ కొనసాగుతోంది. మంగళగిరి మండలంలోని గ్రామాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది. రాజధానిని మార్చవద్దంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. మంగళగిరి మండలం కురగల్లులో రైతులు రోడ్లపైకి వచ్చిన రైతులు ఫెస్టిసైడ్ బాటిల్స్తో నిరసన చేపట్టారు. మరోవైపు మూడు రాజధానులు నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నిరుకొండ రైతులు ఆందోళనకు దిగారు. తుగ్లక్ పాలన అంటూ నిరసన తెలుపుతున్నారు.
దేవినేని ఉమా అరెస్ట్..
రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజధాని గ్రామస్తులు సైతం ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారి కావటంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఉమాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కొనసాగుతున్న బంద్..144 సెక్షన్
రాజధాని పైన ముఖ్యమంత్రి తాజా ప్రకటనను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయం పైన మండిపడుతున్నారు. రైతులు..మహిళలు రోడ్ల పైనే గంటల తరబడి బైఠాయించారు. తాము రాజధాని కోసం భూములను సైతం త్యాగం చేస్తే..రాజధాని ఇక్కడి నుండి మారుస్తారా అని నిలదీస్తున్నారు. ఒక్క రాజధానికే డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా నిర్మిస్తందని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని అమరావతిలో కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసారు. ఇప్పటికే ఇదే అంశం పైన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు..రాజధాని పరిధిలో 144 సెక్షన్ విధించారు.