55 రోజులపాటు గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్
విజయవాడ: ప్రముఖుల రాకపోకలతో పాటు భద్రతా కారణాల రీత్యా గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధిస్తూ విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం నుంచి నుంచి 55 రోజుల పాటు గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఆజ్ఞలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ఐదుగురు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంతో పాటు ఆందోళనలు, నిరసనలు, బైటాయింపు కార్యక్రమాలు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నిషేధమని స్పష్టం చేశారు. జూలై 4 తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
గన్నవరం విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 250 మీటర్ల పరిధిలో 144 (20) సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. శాంతిభద్రతలతో పాటు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.