వారి అంచనాలు తప్పాయి:చంద్రబాబు ఆగ్రహం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 14వ ఆర్ధిక సంఘం అంచనాలు తప్పాయని...నాలుగేళ్ల తరువాత కూడా పొరుగు రాష్ట్రాల కంటే ఏపీ తలసరి ఆదాయంలో వెనుకంజలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
శుక్రవారం అమరావతిలో ఆయన ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. కనీసం 15వ ఆర్ధిక సంఘం ద్వారానైనా ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని, ఏపికి జరిగిన అన్యాయం చక్కదిద్దాలని వినతిపత్రంలో కోరాలంటూ అధికారులకు సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలో వివరిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఒక పుస్తకం విడుదల చేశారు.
కేంద్రం...ఏమీ అమలు చేయలేదు
శుక్రవారం అమరావతిలో ఆయన ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లయినా విభజన చట్టాన్ని అమలు చేయలేదని అన్నారు. ఏపీకి అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ బాధ్యత...కేంద్రానిదే
రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది అతి స్వల్పమేనని, వెనుకబడిన జిల్లాల అభివృద్దికి సైతం అరకొరగా నిధులు ఇచ్చారని దుయ్యబట్టారు. పొరుగు తెలుగు రాష్ట్రంలో సేవారంగంలో 8% రాబడి వృద్ధి ఉందని, అదే ఆంధ్రప్రదేశ్ సేవారంగంలో 2% కూడా వృద్ధి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సేవారంగంలో ఏపీకి రాబడి పెరిగేలా... చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
బిజెపిని...ఎలా నమ్మాలి?
రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిన బిజెపిని ప్రజలు ఎలా నమ్మాలని ఎపి టిడిపి అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడలో జరిగింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ బిజెపికి కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదన్నారు. ఆ పార్టీకి ఓట్లేస్తే వృథాయేనన్నారు. ఈ నెలాఖరులో రాజమహేంద్రవరంలో ‘బీసీ గర్జన' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.
వాడిపోయే దశలో...కమలం
రాష్ట్రంలో కమలం వాడిపోయే దశకు చేరుకుందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసినందుకే భాజపాను తాము దూరం పెట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబు నేతృత్వంలో టిడిపి జెండా రెపరెపలాడటం ఖాయమని జోస్యం చెప్పారు.
మళ్లీ...చంద్రబాబే
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శుక్రవారం ఒక పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి మోదీ అన్యాయం చేయడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నామని బుద్దా వెంకన్న చెప్పారు.కేసుల మాఫీ కోసం జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ప్రజల మనోభావాలను మోదీ వద్ద జగన్ తాకట్టు పెట్టారని బుద్దా వెంకన్న ఆరోపించారు.