జగన్కు 'రాజ్యసభ' షాక్: '15మంది టిడిపిలోకి, రోజా అదుపులో లేదు!'
కాకినాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. అంతకుముందు పదిమంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు., తాజాగా జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు టిడిపిలో చేరుతున్నారు.
మరో పదిహేనుమంది ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరుతారని టిడిపి సీనియర్ నేత జూపూడి ప్రభాకర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో వారు టిడిపిలో చేరుతారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ ఒక్క రాజ్యసభ సభ్యుడిని కూడా గెలిపించుకోలేరన్నారు.
జగన్కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. జగన్ దళిత వ్యతిరేకి అని, అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనను ఏపీ ప్రజలు ఓడించారని చెప్పారు. దళిత ఎమ్మెల్యేల పైన మాటల దాడి చేస్తున్న రోజాను జగన్ అదుపులో పెట్టడం లేదని ధ్వజమెత్తారు.
దళిత టిడిపి ఎమ్మెల్యే అనిత పట్ల రోజా దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. రోజా సస్పెన్షన్ ఇష్యూ విషయంలో సభదే అంతిమ నిర్ణయమని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పైన చర్యలు తీసుకునేందుకు సభకు పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పారు.
జగన్ నియంతృత్వ లక్షణాలు, అపరిపక్వ రాజకీయాల వల్లనే జ్యోతుల నెహ్రూ, ఇతర వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. దళితులకు చంద్రబాబు దాదాపు పదకొండు వందల కోట్లు కేటాయించారని, దళితులకు బాబు ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పారు. 20 లక్షల మంది దళిత కుటుంబాల సాధికారతకు ఎస్సీ కార్పోరేషన్ కృషి చేస్తోందన్నారు.