ఏపీలో మరో 15 పాజిటివ్: కొత్త కేసులన్నీ ఆ మూడు జిల్లాల్లోనే: సమయాన్ని కుదించే దిశగా..
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలోని వేర్వేరు కరోనా వైరస్ ల్యాబొరేటరీల్లో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఆయా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి వెల్లడించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 329కి చేరింది.
Recommended Video
మూడు జిల్లాల్లో కొత్త కేసులు..
కొత్తగా నమోదైన ఈ 15 పాజిటివ్ కేసులన్నీ మూడు జిల్లాల్లోనే నమోదు అయ్యాయి. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆరు చొప్పున, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి. వైరస్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. ఆరుమంది పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వారికి ట్రావెల్ హిస్టరీ ఉందా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నామని నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు.
జిల్లాలవారీగా ఇదీ లెక్క..
జిల్లాలవారీగా అనంతపురం-6, చిత్తూరు-20, తూర్పు గోదావరి-11, గుంటూరు-41, కడప-28, కృష్ణా-35, కర్నూలు-74, నెల్లూరు-49, ప్రకాశం-24, విశాఖపట్నం-20, పశ్చిమ గోదావరి-21 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు వారాలుగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు బ్రేక్ పడకపోవడం వల్ల లాక్డౌన్ పరిస్థితులను మరింత కట్టుదిట్టంగా అమలు చేయల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి సడళించిన సమయాన్ని కుదించడమే మేలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెల్లవారు జామున 6 నుంచి ఉదయం 9 గంటల వరకు నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం.
గంట కుదింపు దిశగా..
కేసులు పెరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమయాన్ని 8 గంటలకే కుదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుదలలో వేగం తగ్గినప్పటికీ.. మరిన్ని ముందు జాగ్రత్తచర్యలను తీసుకోవడం వల్ల కొత్త కేసుల సంఖ్యకు కూడా బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.