రాంగ్ కాల్ లిఫ్ట్ చేసిన బాలిక...అనుమానంతో కొట్టి చంపిన తండ్రి...
విజయవాడ: అనుమానం పెనుభూతం అని ఊరకనే అనలేదు పెద్దలు...కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కేవలం నిరాధారమైన అనుమానంతో చదువుల తల్లి అయిన కూతురును కొట్టి చంపేశాడు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
రాజీవ్నగర్లో నివసించే ఆటోడ్రైవర్ రమణ కు పదో తరగతి చదువుతున్నకృష్ణవేణి అనే కుమార్తె ఉంది. రెండు రోజుల క్రితం తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో ఆయన ఫోన్ కు కాల్ రావడంతో కృష్ణవేణి లిఫ్ట్ చేసింది. అయితే అటువైపు నుంచి ఏ శబ్దం వినిపించకపోవడంతో కాల్ కట్ చేసింది. దీంతో కాల్ చేసిందెవరని తండ్రి అడిగాడు. కుమార్తె రాంగ్ కాల్ అని చెప్పడంతో అనుమానం వచ్చిన అతడు కుమార్తెకు ఎవరో కాల్ చేశారని భావించి కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఆ దెబ్బలకు కుమార్తె చనిపోయింది.
ఏం జరిగిందంటే...
విజయవాడ రాజీవ్నగర్లో నివసించే ఆటోడ్రైవర్ రమణకు 2001లో పెళ్లయింది. ఇతడికి ఒక కుమార్తె కృష్ణవేణి (15) కాగా ఆమె ఇప్పుడు పదవతరగతి చదవుతోంది. రెండురోజుల క్రితం తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో ఆయన ఫోన్ కు ఒక కాల్ వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కృష్ణవేణి ఆ కాల్ లిఫ్ట్ చేసింది. అయితే అటువైపు నుంచి అవతల నుంచి మాటలు ఏమీ వినబడకపోవడంతో హలో..హలో అని ఫోన్ పెట్టేసింది. అంతలో అక్కడకు వచ్చిన రమణ ఫోన్ చేసిందెవరని అడిగాడు. మాటలేమీ వినిపించలేదని రాంగ్ కాల్ అయి ఉంటుందని కుమార్తె జవాబిచ్చింది.
అనుమానం...పెనుభూతమై...
అయితే కుమార్తె కోసమే ఎవరో కాల్ చేశారని భావించిన రమణ ఎవరు కాల్ చేశారో చెప్పాలంటూ కుమార్తె కృష్ణవేణిని కొట్టడం ప్రారంభించాడు. కుమార్తె తనకేం తెలీదని చెప్పినా వినకుండా తీవ్రంగా కొడుతూనే ఉన్నాడు. మధ్యలో అడ్డుపడిన భార్యను కూడా కొట్టాడు. తల్లి, కుమార్తెలను చితకబాదిన అనంతరం వారిని మళ్లీ గదిలో బంధించి బైటకు వెళ్లాడు.
తాగొచ్చి...తిరిగొచ్చి...మళ్లీ
బైటకు వెళ్లి మద్యం సేవించిన రమణ ఇంటికి తిరిగొచ్చి కూతురును మళ్లీ కొట్టడం ప్రారంభించాడు. ఆ దెబ్బలకు తాళలేక కుమార్తె కృష్ణవేణి చనిపోయింది. దీంతో ఖంగుతిన్న అతడు ఈ విషయం బయటకు పొక్కితే ప్రమాదమని గ్రహించి కుమార్తె 24 గంటల కడుపు నొప్పితో మృతి చెందిందని కథ అల్లాడు. అయితే గంటల వ్యవధిలోనే హడావుడిగా కూతురు అంత్యక్రియలకు రమణ సిద్ధం చేస్తుండటంతో అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల రాక...విచారణ
స్థానికుల ఫిర్యాదుతో పాయకాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అంత్యక్రియలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న తండ్రి రమణను అదుపులోకి తీసుకుని విచారించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని పాయకాపురం సీఐ ఎం.డి.సహేరా తెలిపారు.
చదువుల తల్లి...
అన్యాయంగా తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుమార్తె కృష్ణవేణి ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. రాజీవ్గాంధీ నగర పాలక సంస్థ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నకృష్ణవేణి కి చదువంటే ప్రాణమని, స్కూల్ ఫస్ట్ లక్ష్యంగా ఎంతో పట్టుదలగా చదువుతున్న ఆమెని కన్న తండ్రే కేవలం అనుమానంతో పాశవికంగా కొట్టిచంపడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి కిరాతకుల్ని కఠినంగా శిక్షించాలని ఘటన గురించి తెలిసిన వాళ్లందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ఆంధ్రాలో చోటుచేసుకున్న మరో పరువు హత్యగా చెప్పుకోవచ్చు.