మంచులో చిక్కుకున్న150 మంది వరంగల్ వాసులు,'చర్యలు చేపడుతున్నాం'
హైదరాబాద్: కులుమనాలిలో దట్టంగా కురుస్తోన్న పొగమంచు కారణంగా విహార యాత్రకు వెళ్లిన వరంగల్ వాసులు మంచులో చిక్కుకున్నారు. వారం రోజుల క్రితం వరంగల్కు చెందిన 150 మంది విద్యుత్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యలతో కలసి ఉత్తరాది యాత్రకు వెళ్లారు.
కులుమనాలిలో గురువారం మధ్యాహ్నం నుంచి మంచు ఎక్కువగా కురుస్తోంది. అయితే శుక్రవారం ఉదయం వరకే కులుమనాలిలో రూమ్స్ బుక్ అయి ఉండటంతో హోటల్ యాజమాన్యం వారిని రూమ్స్ ఖాళీ చేయించారు. దీంతో మంచులో చిక్కుకుని హోటల్ వద్ద బస్సులోనే ఉండిపోయి 10 గంటలకు పైగా తీవ్ర అవస్ధలు పడుతున్నారు.
కులుమనాలి నుంచి ఈనెల 22 తిరిగి వరంగల్కు రావాల్సి ఉండగా దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో విద్యుత్ అధికారులు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారికి సహకారం అందించాల్సిందిగా అధికారులను వేడుకుంటున్నారు.
వరంగల్ వాసుల కోసం రక్షణకు చర్యలు చేపడుతున్నాం: వేణుగోపాలచారి
కులుమనాలిలో చిక్కుకున్న వరంగల్ వాసుల రక్షణకు చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న వేణుగోపాలచారి తెలిపారు. దీనికి సంబంధించిన హిమాచల్ ప్రదేశ్తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బాధితుల సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటుచేశామని, వివరాలకు 9418015754, 019022 22727కి ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు.
డీసీఎం బోల్తా, తొమ్మిదిమంది విద్యార్థులకు గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలోని చిర్యాని మండలం రాఘవాపూర్ గ్రామం సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 9 విద్యార్థులతో సహా డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులంతా ఆశ్రమ పాఠశాలకు చెందినవారిగా గుర్తించారు.
జిల్లాలోని తిర్యాణి మండలం, సంగిడి మాదర ఆశ్రమ పాఠశాలకు వెళ్లేందుకు 9 మంది విద్యార్థులు కేరేగూడ గ్రామంలో బొలేరో వ్యాను ఎక్కారు. ఈ వ్యాన్ కేరేగూడ గ్రామం నుంచి కందుల బస్తాలతో అసిఫాబాద్కు బయల్దేరగా... విద్యార్థులు ఆ బస్తాలపైకి ఎక్కి కూర్చున్నారు. ఆ తర్వాత రాఘవాపూర్ గ్రామం సమీపంలోని ఘాట్ రోడ్డు వద్దకు రాగానే వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది.
క్షతగాత్రలను తిర్యాణిలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.