నేడు అమరావతికి ఆర్థిక సంఘం రాక...సిఎం చంద్రబాబుతో కీలక భేటి:రెండు రోజుల పర్యటన
అమరావతి:15వ ఆర్థిక సంఘం నేడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి చేరుకోనున్నారు. ఎన్కె సింగ్ నేతృత్వంలోని 17 మంది ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన ఈ బృందం నాలుగు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో రెండు రోజులు అమరావతికి కేటాయించింది.
కేంద్రం తీరుపై సిఎం చంద్రబాబు ఆగ్రహం...ఘాటుగా లేఖ:
మంగళవారం సాయంత్రానికే రేణిగుంట విమానశ్రయానికి చేరుకున్న ఎన్కె సింగ్ ఆర్థిక సంఘం బృందానికి ఎపి ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, కార్యదర్శి పీయూష్ కుమార్, కలెక్టర్ ప్రద్యుమ్న పుష్పగుచ్ఛాలందజేసి ఘన స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం వరకు వివిధ దేవాలయాలను సందర్శించే ఈ బృందం 11వ తేదీన విస్తృతంగా సమావేశాల్లో పాల్గొంటుందని సమాచారం.
ముందుగా...శ్రీవారి సందర్శన
15వ ఆర్థిక సంఘానికి ఎన్కె సింగ్ అధ్యక్షత వహిస్తుండగా డాక్టర్ అశోక్ లాహిరి, అరవింద్ మెహతా, ముహమ్మీత్ సింగ్ భాటియా, డాక్టర్ రవి కోటా, గోపాల్ ప్రసాద్, డైరెక్టర్ భారత్ భూషణ్గార్గే, అన్షుమన్ మిశ్రా ప్రభృతులు సభ్యులుగా ఉన్నారు. ఎపి పర్యటనలో ముందుగా బుధవారం ఉదయం ఐదు గంటలకు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న బృందం అనంతరం 11.30 గంటలకు శ్రీకాళహస్తిలో మల్లేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
అమరావతి రాక...సిఎంతో సమావేశం
భోజన విరామానంతరం కొంత సమయం క్షేత్ర పర్యటనలకు కేటాయించి సాయంత్రం తిరుపతి నుంచి విజయవాడకు బయలుదేరి వస్తారు. గురువారం ఉదయాన్నే కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్లి అక్కడి నుంచి పది గంటలకు వెలగపూడి సచివాలయానికి చేరుకుంటారు. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో ఆర్ధిక సంఘం సభ్యులు వరుసగా భేటీలు జరుపుతారు. ముఖ్యమంత్రి తో భేటీ సందర్భంగా ఆయన, ఆర్ధిక మంత్రి రాష్ట్రంలోని పరిస్థితులపై ఆర్థిక సంఘానికి తెలియపరుస్తారు.
రాజకీయ పార్టీలతోనూ...భేటీలు
అనంతరం ఆర్ధిక శాఖ కార్యదర్శి ఆర్ధిక పరమైన అంశాలను బృందానికి వివరిస్తారు. ఆపై ఆర్ధిక సంఘం సభ్యులు ఆయా విషయాలపై స్పందన తెలియజేస్తారు. అనంతరం సిఎం చంద్రబాబు, అధికారులు కలసి ఆర్ధిక సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చిస్తారు. ఆ తరువాత భోజన విరామం ఉంటుంది. అనంతరం ఆర్థిక సంఘం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతుంది. దీనికోసం వివిధ రాజకీయ పార్టీలకు గంట సమయం చొప్పున కేటాయించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆర్ధిక సంఘం మీడియా ప్రతినిధులతో భేటీ అవుతారు.
నిర్మాణాల పరిశీలన...తిరుగు ప్రయాణం
ఇక 12వ తేదీ ఆర్థిక సంఘం ఉదయం 9.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం వెలగపూడికి చేరుకుని సిఆర్డిఎ అధికారుల ప్రజెంటేషన్ను పరిశీలిస్తారు. 11.30 గంటల నుంచి 12.15 గంటల వరకు గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులతో, ఆ తరువాత పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2.45 గంటల నుంచి గంట సేపు గేట్వే హోటల్లో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం రాత్రి 8,40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Recommended Video