షాకింగ్ : ఏపీ హైకోర్టులో 16 మందికి కరోనా పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం(జూలై 1) హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర పిటిషన్లను ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మంగళవారం రాష్ట్రంలో మరో 704 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇందులో అత్యధికంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 100కిపైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో మరో ఏడుగురు మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 14,595కి చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాలు 187కి చేరాయి. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 648 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 51 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఐదుగురు ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,114 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకూ 6161 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా... ప్రస్తుతం 7897 యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు.