కత్తి కట్టిన కన్నడ సర్కార్: జర్నలిస్టుల అరెస్ట్: అన్నీ బ్లాక్ మెయిల్ కేసులే!
బెంగళూరు: కొన్ని నెలల కిందట కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉదంతం..ఆపరేషన్ కమల. బొటాబొటి మెజారిటీ సర్కార్ను నడిపిస్తున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కర్ణాటక భారతీయ జనతాపార్టీ నాయకులు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తును ఆకర్షిస్తున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి కూడా వచ్చేశారు.
ఈ ఘటన వెనుక- కొందరు జర్నిలిస్టుల ప్రమేయం ఉందంటూ కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించుకుంది. ఆపరేషన్ కమల అంశంపై బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో తరచూ సంభాషణలు సాగించిన ఓ విలేకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ కమలలో భాగంగా- జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో యడ్యూరప్ప ఫోన్ ద్వారా మంతనాలు సాగించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆడియో టేపులను స్వయంగా కుమారస్వామే బయట పెట్టారు. ఈ ఘటన వెనుక రాయచూర్కు చెందిన ఓ విలేకరి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఆ విలేకరి మధ్యవర్తిత్వం వహించినట్లు దర్యాప్తులో తేలడంతో- పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ప్రత్యేక లింగాయత మతం కోసం కర్ణాటక హోమ్శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారంటూ ఓ లేఖ కొద్దిరోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ తరువాత అది నకిలీదని తేలింది. ఉదయ్ ఇండియా అనే ఆన్లైన్ మీడియా సంస్థకు చెందిన హేమంత్ కుమార్ అనే జర్నలిస్టు దాన్ని సృష్టించినట్లు వెల్లడైంది. దీనితో పోలీసులు ఆయనను అరెస్టు చశారు.
మీడియా సంస్థను అడ్డుగా పెట్టుకుని ఓ ఛానల్ విలేకరి హేమంత్ కశ్యప్.. ఓ డాక్టర్ను బెదిరించినట్లు గతంలో కేసు నమోదైంది. దీనిపై ఆరా తీసిన పోలీసులు విలేకరిని బాధ్యునిగా గుర్తించారు. ఆయనను అరెస్టు చేశారు. సదరు డాక్టర్ ఓ మహిళా రోగి వద్ద అసభ్యంగా ప్రవర్తించిన వీడియో తమ వద్ద ఉందని, 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే దాన్ని ప్రసారం చేస్తామంటూ కశ్యప్ బెదిరించారనేది పోలీసుల కథనం. సదరు డాక్టర్ అయిదు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ.. మరింత మొత్తం కావాలంటూ డిమాండ్ చేశారు ఆ విలేకరి. దీనితో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఆయనను అరెస్టు అయ్యారు. హేమంత్తోపాటు మరో ఇద్దరిని బ్లాక్మెయిలర్లుగా పోలీసులు గుర్తించారు.
ఎన్నికల ప్రచార హడావుడి ముగిసిన తరువాత కొద్దిరోజుల పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ రిస్టార్ట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ సినీ నటితో గడిపారంటూ సోషల్ మీడియాలో ఓ కథనం వెలువడింది. దీనిపై ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా- ఇద్దరు జర్నలిస్టు ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు బీజేపీ ఎమ్మెల్యే అరవింద లింబావళిని బ్లాక్మెయిల్ చేశారంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏకంగా ఓ ఛానల్ మేనేజింగ్ డైరెక్టరే అరెస్టు అయ్యారు. ఇలా 50 రోజుల వ్యవధిలో 15 మంది జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు కటకటాల వెనక్కీ వెళ్లారు.