వైసీపీకి టచ్ లో 16 మంది ఎమ్మెల్యేలు ...టీడీపీలో టెన్షన్
ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి ఇప్పుడు భయం పట్టుకుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తమపై వేధింపులు పెరిగిపోయాయని తెగ బాధపడుతున్న టీడీపీ నేతలు ఇప్పుడు పార్టీలో వలసలు కొనసాగుతాయా అన్న ఆందోళనలో ఉన్నారు.ఇక తాజాగా వైసీపీకి టచ్ లో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన ప్రకటన ఇప్పుడు టీడీపీలో టెన్షన్ కు కారణం అయ్యింది.
రాజధానిలో టీడీపీ బృందం ...బొత్సా జోకర్ అన్న అచ్చెన్నాయుడు, జగన్ పై గల్లా జయదేవ్ ఫైర్
టీడీపీకి జంపింగ్ ల భయం
గత ఎన్నికల్లో టీడీపీ 175 స్థానాలకు కేవలం 23 స్థానాలే దక్కించుకుంది.ఇక 23నంబర్ పై ఎన్నో విమర్శలు సైతం ఎదుర్కొంది.ఇక టీడీపీ గెలుచుకున్న 23 స్థానాలలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోనే కొనసాగుతారా అంటే కచ్చితంగా డౌటే అని చెప్పాలి . ఇందులో ఎంతమంది ఉంటారో..ఎంత మంది జంప్ అవుతారో అనే భయం టీడీపీ అధినాయకత్వంలో మొదలైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి ఊహించని విధంగా ఝలక్ ఇచ్చారు.
వల్లభనేని వంశీ బాటలో ఎందరో అన్న టెన్షన్
పార్టీకి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యేగా వలసలకు శ్రీకారం చుట్టారు.ఇక ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని చర్చ జరిగినా ఇంకా వల్లభనేని సైలెంట్ గా ఉన్నారు. దీంతో ఆయన బాటలో నడిచే ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ కి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరే వారు ఎవరు అన్న అనుమానాలు కొద్దిరోజులుగా ఉన్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలతో అది మరింత బలపడింది.
టీడీపీలో జంప్ జిలానీలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు
ఏపీలో ఎన్నికల తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఇక అప్పుడే వలసలు కొనసాగుతాయని భావిస్తే మధ్యలో పార్టీ మార్పులకు కాస్త బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ వైపు నడుస్తుంటే, మరోవైపు జంప్ జిలానీలు పార్టీ చేంజ్ అవటానికి రెడీ అవుతున్నారు. వైసీపీ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు కూడా అందుకు కారణంగా మారాయి.
16 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరటానికి రెడీ అన్న మంత్రి
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతోనే టీడీపీ టెన్షన్ లో ఉంటె తాజాగా ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారం రేపాయి. వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం రెండో విడతను చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రారంభించారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి జీరో గా మారిందన్నారు. టీడీపీ నుండి 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని, రండి అని జగన్ ఒక్క మాట చెప్తే వారంతా వైసీపీలో చేరతారన్నారు. అంతే కాదు టీడీపీ నేతలను కొనుగోలు చెయ్యటానికి జగన్ సిద్ధంగా లేరని కూడా పేర్కొన్నారు. చంద్రబాబులాగా జగన్ చెయ్యరని పేర్కొన్నారు.
తీవ్ర సంక్షోభంలో టీడీపీ
దీంతో ఇప్పుడు వారు ఎవరు అని టీడీపీ ఆరా తీస్తోంది.తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎన్నడూ ఎదుర్కొనలేదు. ఏపీలో అధికారం పోగొట్టుకోవటమే కాదు కనీసం సంఖ్యాబలం కూడా లేకుండా టీడీపీ చావు దెబ్బ తింది. ఇప్పుడు వచ్చినన్ని తక్కువ సీట్లు కూడా గతంలో ఎప్పుడూ రాలేదు. పైగా ఉన్నవారిలో పదహారు మంది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పినట్టు జంప్ అయితే తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతోంది. కాబట్టి టీడీపీ ప్రస్తుతం చాలా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటుంది.