అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది దుర్మరణం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఆర్తరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గండేపల్లి దగ్గర సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ బూడిద లారీ బోల్తా పడటంతో 18 మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ఇసుక లారీలో ఏలూరు బైపాస్ రోడ్డులో 35మంది కూలీలు ఎక్కారు. అయితే కొద్ది సేపటికే గండేపల్లి దగ్గరకు వెళ్లగానే లారీ బోల్తా పడింది.
దీంతో లారీలో ప్రయాణిస్తున్న కూలీల్లో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కత్తిపూడి, శంఖవరం, తొండంగికి వాసులుగా గుర్తించారు. ఘటనకు బాధ్యులైన లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతంలో పని కోసం వెళ్లిన వ్యవసాయ కూలీలు తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు.చింతలపూడి జామాయిల్ తోటల్లో పనుల నిమిత్తం గత నెల 26వ తేదీన వెళ్లారు. పనులు ముగించుకుని స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా లారీ ఎక్కారు. జెసిబీతో బూడిదను తొలగిస్తున్నారు.
ప్రమాదం నుంచి బయటపడినవారిలో కొంత మంది
మొగలి సత్తిబాబు, కుడిగట్ల శివ, దాడిచెట్టి రాంబాబు, గట్టెం సూరిబాబు, పల్లా సత్తిబాబు, ఈగల సూర్యచంద్రరావు, కరణం దాసు, ఈగల శివ, గూడి అప్పారావు, గొల్లం మణికంఠలను వెలికి తీశారు.
సంఘటనా స్థలానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ చేరుకున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు.
రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించనున్నట్లు, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. హోం మంత్రి చిన రాజప్ప హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.