ఖేలో ఆంధ్రా - జయహో ఆంధ్రా : ఖేలో ఇండియాకు 160 మంది ఎంపిక..!!
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఏపీ నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. వీరితో మంత్రి రోజా ముఖాముఖి నిర్వహించారు. హర్యానాలో జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు ఖేలో ఇండియా క్రీడోత్సవం జరగనుంది. ఏపీ నుంచి పాల్గొనే క్రీడాకారులకు మంత్రి రోజా సంప్రదాయ బద్దంగా వీర తిలకం దిద్ది పంపారు. వారికి ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా కు ఎంపికైన క్రీడాకారులతో మంత్రి ముఖా ముఖి నిర్వహించారు.
హర్యానా వెళ్తున్న క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వటానికి వీలుగా శాప్ ఛైర్మన్ సిద్దార్దరెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ ఆవిష్కరించారు. అదే విధంగా... 2022 జాతీయ పారాలింపిక్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను మంత్రి రోజా ఆవిష్కరించారు.గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా ఎటువంటి టోర్నమెంట్లు.. క్రీడల పోటీలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ ఏడాది ఒకే సారి 160 మంది రాష్ట్రం నుంచి ఖేలో ఇండియాకు ఎంపిక కావటం సంతోషకరం గా పేర్కొన్నారు. 19 విభాగాల నుంచి వీరంతా ఎంపిక అయినట్లు వివరించారు. ఎంపిక అయిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశంగా పేర్కొన్నారు.
అమ్మాయి లకు జూడో అవసరమని వివరించారు. ఖేలో ఇండియా యూత్ ప్రోగ్రామ్స్ కు తాము కూడా సడన్ గా వస్తామని .. ఏపీ క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తామని మంత్రి రోజా హామీ ఇచ్చారు. ఏపీలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయని..సమ్మర్ ట్రైనింగ్ సెంటర్లలో దాదాపు 45 వేల మంది శిక్షణ పొందుతున్నారని మంత్రి చెప్పారు. ఖేలో ఇండియాలో రాష్ట్రానికి అత్యధిక పథకాలు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు. త్వరలోనే సచివాలయ ఉద్యోగులను ఆటల పోటీలు నిర్వహిస్తామని రోజా వెల్లడించారు. సచివాలయంలో జరిగిన దాదాపు 13 ఈవెంట్లకు సంబంధించి 600 మంది ఉద్యోగులు పోటీల్లో పాల్గొన్నారు.