కరోనా: ఐసోలేషన్ సెంటర్కు 17 నెలల చిన్నారి సహా 10 మంది..
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయ్. శుక్రవారం రాత్రి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 162గా నమోదైంది. మరోవైపు విశాఖపట్టణం జిల్లా తాటిచెట్లపాలెంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ముగ్గురితోపాటు 17 నెలల బాలుడిని కూడా ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
తాటిచెట్లపాలెంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకిందని తేలడంతో జీవీఎంసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న ముగ్గురు సహా చిన్నారి.. భవనం పై పోర్షన్, కింది పోర్షన్లో ఉన్న పదిమందిని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. తాటిచెల్లపాలెంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. మూడు కిలోమీటర్ల పరిధిలో గల కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న జీవీఎంసీ వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శాస్త్రి, సహాయ వైద్యాధికారి డాక్టర్ రాజేశ్ తాటిచెట్లపాలెంలో పర్యటించారు. అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, పారిశుద్ద్య, ఆరోగ్య విభాగం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మరొసారి సర్వే చేశారు. ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లి.. జీవీఎంసీ వాహనంతో క్లోరిన్ వాటర్, ట్యాంకర్తో కెమికల్ స్ప్రే చల్లారు. ప్రధాన రహదారులతోపాటు ఇరుకు సందుల్లో కూడా స్ప్రే చేశారు.
Recommended Video
తాటిచెట్లపాలెంలో కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. చుట్టుపక్కల ఉన్నవారు తమకు కూడా వైరస్ సోకిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిధిలో గల మూడు కిలోమీటర్ల మేర ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.