బాలకృష్ణ నియోజకవర్గంలో రెండు కరోనా పాజిటివ్: పదేళ్ల బాలుడికి..ఆ రెండు జిల్లాల్లో భయోత్పాతం..!
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ ఒక్కసారిగా రాష్ట్రంలో విజృంభించింది. ఒకేరోజు.. ఒకేసారి 17 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. ఇంత పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వారిలో అత్యధికులు ఢిల్లీలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలకు హాజరైన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తుండగానే.. పాజిటివ్ కేసుల రూపంలో వారు వెలుగులోకి వచ్చారు.
ఢిల్లీ మత ప్రార్థనలతో ఏపీ ఉలికిపాటు: మంత్రులకు టాస్క్.. బరిలో వలంటీర్లు: ప్రాంతాల వారీగా స్కానింగ్.
లేపాక్షిలో రెండు కేసులు.. అనంతలో తొలిసారిగా..
అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో కొత్తగా రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండే గ్రామం ఇది. ఇక్కడ రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పదేళ్ల బాలుడితో పాటు.. 34 సంవత్సరాల మహిళకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారితమైంది. ముస్లింల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మక్కాను సందర్శించి వచ్చిన తమ సమీప బంధువుల వల్ల ఈ ఇద్దరికీ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఆ రెండు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికం..
ప్రకాశం, గుంటూరు.. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఈ రెండు జిల్లాల్లోనే అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఎనిమిది, గుంటూరు జిల్లాలో అయిదు కేసులు కొత్తగా బహిర్గతం అయ్యాయి. ఈ రెండు జిల్లాలతో పాటు అనంతపురం-2, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేులు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా చీరాల, కుంకలముర్రు, కందుకూరు, గుంటూరు టౌన్, కారెంపూడిల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న చీరాల వాసులు
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్ మసీదు భవన సముదాయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని చీరాలకు వచ్చిన ఆరుమందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. మదీనాను సందర్శించిన స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఓ స్థానికుడి సమీప బంధువులో వైరస్ కనిపించడంతో ఇదివరకే అతణ్ని రాజమహేంద్రవరం ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. మిగిలిన వారు కూడా ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులేనని అధికారులు వెల్లడించారు.
కొంప ముంచిన ప్రార్థనలు..
రాష్ట్రంలో కొత్తగా నమోదైన 17 కేసుల్లో అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన రెండింటిని మినహాయిస్తే.. మిగిలిన వన్నీ ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలతో ముడిపడి ఉన్నవే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకుముందు నమోదైన కేసులు కూడా మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వల్లే వ్యాప్తి చెందాయని నిర్ధారితమైంది. ఒకేసారి కరోనా పాజిటివ్ కేసులు 40కి పెరిగిపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. మరింత మంది ఉండొచ్చనే అనుమానంతో జిల్లాలవారీగా అధికారులు జల్లెడ పడుతున్నారు. వారి కోసం గాలిస్తున్నారు.