ఏపీలో కొత్తగా 17 కేసులు- మొత్తం 40కి చేరిన బాధితులు- అంతా ఢిల్లీ వెళ్లిన వారే..!
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తాజాగా అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన వారి ద్వారా చాలా మందికి ఈ మహమ్మారి సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సంఖ్య దాదాపు 700కు పైగా ఉండగా.. వీరి ద్వారా మొత్తం 20 మందికి పైగా బాధితులుగా మారినట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఏపీలో కరోనా వ్యాప్తి..
ఏపీలో కరోనా వారస్ మహమ్మారి అనూహ్యంగా విస్తరిస్తోంది. కేవలం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కారణంగా నిన్న అర్ధరాత్రి నుంచి 17 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలా మంది నేరుగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు కాగా. మరికొందరు వీరి నుంచి కరోనా సోకిన వారు ఉన్నారు. దీంతో వీరందరినీ క్వారంటైన్ కు పంపి చికిత్స అందిస్తున్నారు. వీరి ద్వారా ఇంకా ఎంతమందికి సోకిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
40కి పెరిగిన పాజిటివ్ కేసులు. సర్కారు ఆందోళన
ఏపీలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి సంఖ్య తాజా కేసులతో కలిపి 40కి చేరింది. ఇప్పటివరకూ ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన వారి సంఖ్య 700కు పైగా ఉండగా.. వీరి నుంచి మరెంత మందికి సోకిందో తెలియని పరిస్ధితి. దీంతో వీరందరి కోసం పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా గాలిస్తున్న పరిస్ధితి. మరోవైపు ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా పరిస్ధితి కాస్త అదుపులోనే ఉందని భావించిన ప్రభుత్వానికి నిన్న రాత్రి నుంచి నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా ఆందోళన పెంచుతున్నాయి.
Recommended Video
విదేశీ బెడద తప్పింది ఇప్పుడు స్వదేశీ..
ఇప్పటివరకూ ఏపీలో నమోదైన 23 కేసుల్లో అత్యధికంగా విదేశాల నుంచి నేరుగా ఏపీకి చేరుకున్న వారు, వారి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులకు సోకిన కేసులే ఎక్కువ. కానీ నిన్న రాత్రి నుంచి పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. కేవలం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచే ఇప్పుడు అత్యధిక కేసులు నమోదైనట్లు తేలడంతో దీని ప్రభావం ఎక్కడి వరకూ వెళ్తుందో ఎవరూ చెప్పలేని పరిస్దితి.