వైసీపీతో టచ్లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు : సజ్జల సంచలన వ్యాఖ్యలు
శాసనమండలి రద్దు దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న వేళ.. ప్రభుత్వ చర్యలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాల్లో టీడీపీ తలమునకలైంది. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది మైండ్ గేమా..? లేక నిజంగానే టీడీపీ నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సజ్జల ఏమన్నారు...
టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది ఎమ్మెల్యేలు,పలువురు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సజ్జల అన్నారు. అయితే వాళ్లందరినీ తీసుకుని తామేం చేసుకోవాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. డబ్బులు ఇచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం జగన్కు లేదన్నారు.
జగన్ నవతరం నాయకుడు..
సీఎం జగన్ నవతరం నాయకుడు అని.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని సజ్జల ఎద్దేవా చేశారు. మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో జరిగిందని.. కీలక నిర్ణయాల విషయంలో అన్ని వర్గాల సలహాలు సూచనలు తీసుకోవాలనే సమయం ఇచ్చామని అన్నారు. దానికి ఎల్లో మీడియా దారుణమైన వక్రీకరణలు చెబుతోందన్నారు.
భ్రమల్లో టీడీపీ..
మండలిని తాము తక్కువ చేయడం లేదని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగన్ అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నారని అన్నారు. మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందన్నారు. గతంలో రాజధానిని గ్రాఫిక్స్లో అద్భుతంగా చూపించి ప్రజలను మోసం చేశారని.. ఇప్పుడు మండలి తమ చేతిలో ఉంది కదా అని ఏదైనా చేసేయొచ్చు అన్న భ్రమలో టీడీపీ ఉందని విమర్శించారు.
ఛైర్మన్ను ప్రభావితం చేశారన్న సజ్జల..
మండలి ఛైర్మన్ను చంద్రబాబు ప్రభావితం చేశారని, తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మండలి సమావేశాల సందర్భంగా గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు సామాన్య కార్యకర్త అంటే హీనంగా వ్యవహరించారని అన్నారు. ప్రజలు మీ గ్రాఫిక్స్ రాజధానిని నమ్మకనే లోకేష్ను ఓడించారని అన్నారు. ప్రజల సంపూర్ణ మద్దతు తమకే ఉందని, ఇకనైనా టీడీపీ నేతలు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.