ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి బులెటిన్లో 100 కంటే తక్కువగా నమోదైన కరోనా కేసులు.. ఇవాల్టి బులెటిన్లో 200లకు చేరువగా ఉన్నాయి. అయితే, కరోనా కొత్త కేసుల కంటే కూడా కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. తాజాగా 200 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.
Recommended Video
ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 39,099 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 179 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకరు కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,86,245కు చేరింది. తాజా మరణంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 7142కు చేరింది.
ఏపీలో 1660 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్వవధిలో రాష్ట్రంలో 231 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,77,443కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1660 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,26,43,313 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 4, చిత్తూరులో 40, తూర్పుగోదావరిలో 15, గుంటూరులో 24, కడపలో 9, కృష్ణాలో 35, కర్నూలులో 11, నెల్లూరులో 3, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 18, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలోనూ తగ్గుముఖంపట్టిన కరోనా
మరోవైపు దేశంలోనూ కరోనా కొత్త కేసుల భారీగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 7,09,791 నమూనాలను పరీక్షించగా.. 10,064 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇవి ఏడు నెలల కనిష్టానికి చేరాయి. కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837కు చేరింది. మరోవైపు ఒక్క రోజు వ్యవధిలో 17,411 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,02,28,753కు పెరిగింది. గత 24 గంటల్లో 137 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,52,556కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,00,528 యాక్టివ్ కేసులున్నాయి.