వచ్చేశారు: కౌలాలంపూర్ నుంచి విశాఖకు చేరుకున్న 185 మంది విద్యార్థులు
విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న సుమారు 185 మంది భారత విద్యార్థులు బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంకు చేరుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
కాగా, విశాఖ విమానాశ్రయం చేరుకున్న విద్యార్థులకు వైద్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి పరీక్షలు నిర్వహించారు. వారిలో జలుబు, దగ్గు లక్షణాలతో ఉన్న విద్యార్థులను 'ఏ' కేటగిరీగా విభవించినట్లు ఏసీపీ స్వరూప తెలిపారు. బీపీ, మధుమేహం ఉన్న వారిని బి కేటగిరీగా, ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారిని సీ కేటగిరీగా విభజించినట్లు తెలిపారు. కేటగిరీలా వారిగా వారికి పరీక్షలు చేసినట్లు చెప్పారు.
అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు, మిగిలిన విద్యార్థులను ఐసోలేషన్ వార్డులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ వివరించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉండటంతో వారిని ప్రత్యేక బస్సులలో స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన వారిని అక్కడి వైద్యారోగ్య శాఖ అధికారులకు వద్దకు అప్పగిస్తామని చెప్పారు.
M Raj Kishore, Director, Visakhapatnam International Airport, Andhra Pradesh: One Air Asia flight landed at Visakhapatnam airport today, after evacuating 185 students from Kuala Lumpur. All passengers will be house quarantined for the next 28 days. #Coronavirus pic.twitter.com/sTNJrIsnYl
— ANI (@ANI) March 18, 2020
ఇది ఇలావుండగా, ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మరో 100 వరకు భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిలోనూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. తమను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై విదేశాంగశాఖ దృష్టిసారించినట్లు తెలిసింది.