విద్యార్థులు, పోలీస్ సహా 'ఎర్ర' దొంగల అరెస్ట్, కాల్మనీ బాధితురాలికి ఎస్సెమ్మెస్ బెదిరింపు
చిత్తూరు/విజయవాడ: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుధవారం నాడు పోలీసులు 19 మందిని అరెస్టు చేశారు. అందులో ముగ్గురు విద్యార్థులు ఉండటం గమనార్హం. తిరుమల, తిరుచానూరు, ఎంఆర్ పల్లిలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు.
ఈ దాడులలో 19 మంది ఎర్ర చందనం దొంగలను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు సహా, వేలూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. పట్టుబడిన వారు పోలీసు యూనిఫాంలో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఎర్ర చందనం అక్రమ రవాణాకు ట్రాఫిక్ కానిస్టేబుల్ సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా తిరుపతి పట్టణ ఎస్పీ గోపినాథ్ జెట్టీ మాట్లాడుతూ... గత రెండు నెలల్లో 42మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసినట్లు చెప్పారు.
గతంలోనూ కొందరు విద్యార్థులు పట్టుబడ్డారన్నారు. అరెస్టయిన వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పోలీసు యూనిఫాంలో వాహనాల్లో తిరుగుతున్నారు. వారికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సహకరించాడు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.14 లక్షల వరకు ఉంటుంది.
కాల్ మనీ బాధితురాలికి బెదిరింపు
విజయవాడలో ఓ కాల్ మనీ బాధితురాలుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె నగర పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. ఆమెకు ఎస్సెమ్మెస్ ద్వారా బెదిరింపు వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.