ఏపీలో కరోనా అప్డేట్... కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,234కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7133కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2411 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (జనవరి 12) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా మరో 234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,75,690కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 40,986 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,23,96,593కు చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 49 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 32,గుంటూరులో 31 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు,విజయనగరం జిల్లాల్లో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,23,983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మంగళవారం కరోనా వ్యాక్సిన్ కోవీషీల్డ్ రాష్ట్రానికి చేరుకుంది. తొలివిడతగా 4.7లక్షల వ్యాక్సిన్ డోసులను పుణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపించారు. అక్కడినుంచి ప్రత్యేక కంటైనర్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి తరలించారు. బుధవారం(జనవరి 13) 19 వాహనాలలో అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు వ్యాక్సిన్ను తరలించనున్నారు. ఈ నెల 16న కరోనా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ డెలివరీ వాహనాలలో 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్ను నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశారు.
గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజ్లో రెండు పెద్ద వాక్ ఇన్కూలర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి 40 క్యూబిక్ మీటర్లు.. రెండోది 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి వున్నాయి. వ్యాక్సిన్ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి వ్యక్తులకు ప్రవేశం నిషేధించారు. 8 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. టీకాల పంపిణీలో భాగంగా తొలి దశలో 3.87లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.