విజయవాడలో తొలి కరోనా మరణం: 30వ తేదీ నాడే మృతి: కుమారుడికి పాజిటివ్: షాకింగ్ ట్విస్టులు.. !
విజయవాడ: రాష్ట్రంలో ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తొలి మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మరణానికి ఢిల్లీలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మృతుడి కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన తరువాత వైరస్ బారిన పడ్డారు. కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సంక్రమించి ఉంటుందని, దీని బారిన పడిన రోజే ఆయన మరణించారని చెప్పారు.
30వ తేదీన మరణించగా..
మృతుడి పేరు సుభాని. వయస్సు 55 సంవత్సరాలు. విజయవాడ శివార్లలోని కుమ్మరిపాలెంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కిందటి నెల 30వ తేదీన సోమవారం నాడు ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీనితో చికిత్స కోసం అదే రోజు ఉదయం 11:30 గంటలకు విజయవాడ జనరల్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలను నిర్వహించిన గంట వ్యవధిలోనే.. అంటే 12:30 గంటలకు ఆయన మరణించారు. హైబీపీ, డయాబెటిస్ కార్డియాక్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఆయనకు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన కుమారుడి నుంచి
సుభాని కుమారుడు కిందటి నెల దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అదే నెల 17వ తేదీన ఆయన స్వస్థలానికి చేరుకున్నారు. కొద్దిరోజుల తరువాత ఆయన తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడ్డారు. ఈ నెల 31వ తేదీన ఆయనను విజయవాడ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది.
తండ్రి మరణించిన మరుసటి రోజు కుమారుడికి పాజిటివ్..
కుమారుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడానికి ముందు రోజే అంటే కిందటి నెల 30వ తేదీ నాడే తండ్రి మరణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తండ్రి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో మరణించినట్లు భావించిన అధికారులు.. ఆయన కుటుంబ సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కుమారుడికి పాజిటివ్గా తేలింది. తండ్రి మరణించడానికి ముందే- కుమారుడు వైరస్ బారిన పడ్డారని, ఆయన నుంచి తండ్రికి కరోనా సోకి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Recommended Video
ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉండటం వల్ల..
మృతుడు సుభానికి హైబీపీ, డయాబెటిస్ కార్డియాక్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఆయనకు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఫలితంగా- ఆయన కరోనా వల్ల మరణించారా? లేక ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించారా? అనే విషయాన్ని నిర్ధారించడానికి అధికారులకు నాలుగు రోజులు పట్టింది. కరోనా వైరస్ వల్లే మరణించినట్లు చివరికి నిర్ధారించారు. వైరస్ వల్ల మరణించినట్లు డాక్టర్లు నివేదిక అందడంతో ఈ మరణాన్ని తాము ధృవీకరించినట్లు నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు.