ఏపీ ముందడుగు: పిడుగుపాటును ముందే గుర్తించారు, ఎలాగంటే..
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్య మరో అరగంటలో పిడుగు పడుతుందని మంగళవారం నాడు విపత్తు శాఖ హెచ్చరించింది.
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్య మరో అరగంటలో పిడుగు పడుతుందని మంగళవారం నాడు విపత్తు శాఖ హెచ్చరించింది. అది హెచ్చరించినట్లే రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆ గ్రామాల మధ్య పిడుగు పడింది.
ముందస్తు జాగ్రత్తతో ఆయా గ్రామ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ పిడుగుపాటుకు పలువురి ఇళ్లలో టీవీలు పాడయ్యాయి. కొంత ఆస్తి నష్టం మాత్రం జరిగింది. అయితే పిడుగు పడుతుందని ముందే హెచ్చరించడం గమనార్హం.
ఏపీ ముందడుగు
సాధారణంగా తుపాన్లపై ముందే హెచ్చరికలు వస్తాయి. వర్షాలు ఎప్పుడుపడతాయో, ఉష్ణోగ్రతలు ఏ మేరకు పెరుగుతాయో కూడా ముందే చెబుతారు. అయితే పిడుగుల గురించి మాత్రం ముందుగా తెలిసే అవకాశం ఇంతవరకు రాలేదు. ఇప్పుడదీ అందుబాటులోకి వచ్చింది. పిడుగులు ఎప్పుడు.. ఏ ప్రాంతంలోపడే అవకాశం ఉందో అరగంట ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సమకూర్చుకుంది. ఈమేరకు హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది.
ముందే హెచ్చరికలు
దీంతో మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు ముందే హెచ్చరించింది. కుప్పం మండలంలో కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల సమీపంలో, పలమనేరు మండలంలో మొగిలి, కుమైల మధ్య పిడుగుపడే అవకాశాన్ని పసిగట్టారు. ఇటీవల అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కలుగోడులో పిడుగు ప్రమాదంపై పావుగంట ముందుగానే జిల్లా యంత్రాంగానికి సమాచారమిచ్చారు. ఈ పరిజ్ఞానంపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించారు. విపత్తుల నిర్వహణ కమిషనర్ శేషగిరిబాబు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి, తాము ఇస్రోతో చేసుకున్న ఒప్పందాన్ని గురించి వివరించారు.
ఎలా అంటే..
విపత్తుల నిర్వహణ సంస్థ అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ వర్క్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. దీని ద్వారా ఏ ప్రాంతంలో పిడుగుపడుతుందో అక్కడ నివాస ప్రాంతాలున్నాయా లేదో కూడా తెలుసుకోవచ్చు. వెంటనే ఆ ప్రాంత అధికార యంత్రాంగానికి సమాచారం పంపిస్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా విపత్తుల నిర్వహణ శాఖ పరిశీలిస్తోంది. నెల రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు పిడుగుపాటుకు సంబంధించిన సూచనలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
చంద్రబాబు సూచనలు
ఈ హెచ్చరికల్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు కూడా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంగళవారం రాత్రి ఇలాగే హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా ప్రాంతాల అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తమై దండోరా వేయించారు. కుప్పం ప్రాంతంలో రెండు పిడుగులుపడ్డాయనీ, వాటిలో ఒకటి బైరెడ్డిపల్లె జనావాసాలకు 200 మీటర్ల దూరంలో పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సాధికార సంస్థ తెలిపింది.
దేశంలో ఇదే తొలిసారి.. సెన్సార్లు ఏర్పాటు
పిడుగుపాటుపై ముందుగా సమాచారాన్ని పసిగట్టి హెచ్చరించడం దేశంలో ఇదే తొలిసారి. ఇందుకోసం అనంతపురం, కుప్పం, విశాఖల్లో ప్రత్యేక సెన్సార్లు ఏర్పాటు చేశారు. మరో ఎనిమిది ప్రాంతాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెన్సారు పరిధి 200 కి.మీ. ఉంటుంది. త్వరలో మొబైల్ ఫోన్లకు కూడా పిడుగుపాటు సమాచారం అందించే సౌకర్యం రానుంది.