కేసీఆర్ : బంజారాహిల్స్లో బంజారాలకు 2 ఎకరాల భూమి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్లో బంజారాలకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం శాసన సభలో ప్రకటించారు. లంబాడాలకు ఎకరా, ఆదివాసీలకు ఎకరా భూమిలో రెండు భవంతులు కట్టిస్తామని చెప్పారు. రెండు ఎకరాల్లో రెండు భవంతులు కట్టిస్తామన్నారు.
సొసైటీ, వక్ఫ్ భూముల అక్రమాలు తేల్చేందుకు రెండు సభా సంఘాలను స్పీకర్ మధుసూదనా చారి ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, ఫిలిం నగర్, నందగిరి హిల్స్, జర్నలిస్ట్ కాలనీ తదితరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని సొసైటీల పైన సభా సంఘం వేశారు. వక్ఫ్ భూముల పైన మరో సభా సంఘం వేశారు.
అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు వక్ఫ్ భూములకు ఒకటి, సొసైటీ భూములకు మరో కమిటీని వేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆయా కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పీకర్ను కోరారు.
వక్ఫ్ భూములు కాపాడటం తమ బాధ్యత అన్నారు. వక్ఫ్ బోర్డుకగు జ్యూడిషియల్ అధికారులు కల్పిస్తామన్నారు. హౌసింగ్ సొసైటీ అక్రమాలు, వక్ఫ్ భూముల మీద జాయింట్ హౌస్ కమిటీ వేయాలన్నారు. హౌసింగ్ సొసైటీలు, భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని అన్నారు.