2వేల కోట్ల నల్లధనం.. చంద్రబాబు మాజీ పీఏతో పాటు పార్టీ నేతల ఇళ్ళల్లో సోదాలలో విస్తుపోయే అంశాలు !!
ఏపీలో టీడీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేసి ఐటీ శాఖ దాడులు చేసింది. ఇక ఆ దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలేంటి ? టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పీఏ సహా ఆపార్టీ నేతలు, వారికి సంబంధించిన కంపెనీలపై దాడులకు సంబంధించి ఆదాయపు పన్నుశాఖ ఏం చెప్తుంది అన్న అంశాలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారాయి.
సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్
ప్రాధమిక పరిశోధనలోనే రూ.2వేల కోట్లను తరలించినట్టుగా ఆధారాలు
ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణే సహా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహించామన్న ఐటీ అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ సంస్థల పాత్రపై సోదాలు చేశామని పేర్కొన్నారు . తాజాగా రూ. 2వేల కోట్ల నల్లధనానికి సంబంధించి దాడులు చేశామన్న ఐటీ అధికారులు ప్రాధమిక పరిశోధనలోనే రూ.2వేల కోట్లను తరలించినట్టుగా వెలుగుచూసిందని పేర్కొన్నారు.
విదేశాలకు లావాదేవీలు జరిపినట్టుగా సోదాల్లో బయటపడిందన్న ఐటీ
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ తో సహా పలువురు టీడీపీ నేతలపై జరిపిన ఐటీ దాడుల్లో లెక్కచూపని రూ.85లక్షల నగదు, రూ. 71లక్షల నగలు, 25 బ్యాంకు లాకర్లు గుర్తించి, స్వాధీనంచేసుకున్నామని ఐటీశాఖ వెల్లడించింది . బోగస్ సబ్ కాంట్రాక్టర్లు, అధిక రేట్లతో తప్పుడు బిల్లులు క్లెయిమ్ చేసిన అతి పెద్ద రాకెట్ను ఛేదించామని ఐటీ శాఖ పేర్కొంది. విదేశాలకు లావాదేవీలను జరిపినట్టుగా సోదాల్లో బయటపడిందన్న ఐటీ చంద్రబాబు మాజీ పీఏ తో పాటు మరి కొంత మంది అనుయాయుల నుండి చాలా కీలక ఆధారాలు సీజ్ చేశామని వెల్లడించారు .
షెల్ కంపెనీలను సృష్టించి లావాదేవీలు జరిపినట్టు గుర్తించిన ఐటీ
బోగస్ కంపెనీలను సృష్టించి సబ్ కాంట్రాక్టులను ఇచ్చినట్టుగా సోదాల్లో లభ్యమైందని పేర్కొన్నారు ఐటీ అధికారులు .ఈ మెయిల్స్, వాట్సాప్ సందేశాలు, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సబ్ కంపెనీల నుంచి మరో సబ్ కంపెనీలు, అక్కడనుంచి చిన్న కంపెనీలు ఇలా గొలుసుకట్ట పద్ధతిలో కంపెనీలు సృష్టించి 2వేల కోట్ల నల్లదనాన్ని డబ్బును తరలించారని వెల్లడించారు . ట్యాక్స్ ఆడిటింగ్, బుక్ మెయింటినెన్స్, అక్కౌంటింగ్లనుంచి తప్పించుకునేందుకు రూ.2 కోట్ల టర్నోవర్లోపు కంపెనీలను సృష్టించి ఈ లావాదేవీలను జరిపారని ఐటీ పేర్కొంది .
విదేశాలకు డబ్బు .. మళ్ళీ అదే డబ్బు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో
ఈ కంపెనీలన్నీ రిజిస్టర్డ్ చిరునామాల్లో లేవని ఐటీశాఖ తెలిపింది .ఈ కంపెనీల ఆదాయపు పన్ను ఫైలింగ్ కూడా ప్రధాన కాంట్రాక్టర్ కంపెనీల్లోని ఐపీ అడ్రస్లతో జరిగాయని బయటపెట్టిన ఐటీశాఖ నగదును విదేశాలకు తరలించి, అక్కడనుంచి మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో తిరిగి రప్పించారన్న అనుమానాలు బలపడుతున్నాయని వెల్లడించింది. ఇక సేకరించిన ఆధారాలతో సమగ్ర దర్యాప్తు జరపనుంది ఐటీ శాఖ .