దళితులపై మరో దారుణ ఎటాక్ : ఈసారి ఏపీలో..
హైదరాబాద్ : ఓవైపు ప్రధాని మోడీ.. ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు సైతం.. దళితులపై దాడులకు పాల్పడే వారిని దేశ విద్రోహులుగా అభివర్ణిస్తున్నా..! ఆ పరంపరకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. గుజరాత్ దాడులపై రేగిన దుమారం ఇంకా సర్దుమణగముందే.. ఏపీలో ఇద్దరు దళిత సోదరులపై గో రక్షక సమితి కార్యకర్తలు దాడికి పాల్పడ్డడం.. విషయాన్ని మరింత తీవ్రతరం చేసేదిగా మారింది.
అమలాపురంలో నివాసముండే మోకాటి ఎలిసా, లాజర్ అనే ఇద్దరు దళిత సోదరులు.. ఓ కూరగాయల వ్యాపారి విజ్ఞప్తి మేరకు సోమవారం నాడు ఓ చనిపోయిన ఆవు చర్మం ఒలవడానికి వెళ్లారు. మేత మేస్తోన్న క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఆ ఆవు చనిపోయింది. అయితే సదరు వ్యాపారి విజ్ఞప్తి మేరకు ఆవు చర్మాన్ని తీయడానికి వెళ్లిన ఆ ఇద్దరు సోదరులపై గోరక్షక్ష దళం దారుణమైన దాడికి తెగబడింది.
సోదరిలిద్దరు ఆవు చర్మాన్ని తీస్తున్న క్రమంలో.. వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్న గోరక్షక దళ సభ్యులు విచక్షణా రహితంగా ఇద్దరిపై దాడులకు తెగబడ్డారు. వారిద్దరినీ ఓ కొబ్బరి చెట్టుకు కట్టేసి, బట్టలిప్పి తీవ్రంగా కొట్టారు. అనంతరం విషయం పోలీసుల దృష్టికి వెళ్లి.. బాధిత సోదరులిద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాగా దాడిలో తీవ్రంగా గాయపడడంతో.. ఇద్దరు సోదరుల్లో ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది.
దాడి చేసిన గోరక్షక దళ సభ్యుల్లో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. మొన్నటికి మొన్న తెలంగాణలో పర్యటించిన మోడీ.. 'దళితులపై దాడి చేసే ముందు నాపై దాడి చేయాలి.. గోరక్షక ముసుగులో దళితులపై దాడులకు పాల్పడేవాళ్లంతా దేశ ద్రోహులే' అన్న ఆయన వ్యాఖ్యలకు వీళ్లెవరికీ చెవికెక్కపోవడం శోచనీయం.