ఇద్దరి పట్టివేత: స్పీకర్, పౌడర్ డబ్బాల్లో బంగారం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద కిలోల కొద్దీ బంగారం వరుసగా పట్టుబడుతోంది. తాజాగా అక్రమంగా కిలోన్నర బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శుక్రవారంనాడు అదుపులోకి తీసుకున్నారు.
కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం కేరళకు చెందిన గులాం నాసర్, హైదరాబాద్కు చెందిన గులాం ఇల్లానీ ఇద్దరూ దుబాయ్ నుంచి శుక్రవారం ఎయిర్పోర్టుకు రాగా ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయగా కారు స్పీకర్, పౌడర్ డబ్బాల్లో వున్న బంగారాన్ని గుర్తించారు.
వారి నుంచి కస్టమ్స్ అధికారులు కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్పీకర్లను తీసుకొచ్చిన గులాం నాసర్ తనిఖీ చేయడాన్ని అంగీకరించలేదు. దీంతో కస్టమ్స్ అధికారులు అనుమానంతో స్పీకర్ను తనిఖీ చేయగా బంగారం బయటపడింది. స్పీకర్కు అయస్కాంతం ఉందనే భ్రాంతి కలిగించి బంగారాన్ని అందులో తీసుకుని వచ్చాడు.
జిలానీ టాల్కమ్ పౌడర్ టిన్స్లో, నివీయా క్రీమ్ బాక్సుల్లో బంగారం షీట్లు పెట్టి తీసుకుని వచ్చాడు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 43 లక్షల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.