తెలుగు ప్రొఫెసర్లకు విముక్తి: ట్విట్టర్లో సుష్మా, థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
న్యూఢిల్లీ: గతేడాది లిబియాలో కిడ్నాప్కు గురైన తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన తిరువీధుల గోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన బలరాం కిషన్లు సురక్షితంగా విడుదలయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
వీరిని విడిపించడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించాయని, త్వరలోనే ఇద్దరూ ఇండియాకు వస్తారని సుష్మా తెలిపారు. వీరిద్దరూ విడుదల కావడంపై సుష్మా హర్షం వ్యక్తం చేశారు. గతేడాది కిడ్నాప్కు గురైన వీరిద్దరూ ఏడాదికి పైగా బందీలుగా ఉన్నవీరు సురక్షితంగా విడుదలైనట్లు తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు సుష్మా ట్విట్టర్లో పేర్కొన్నారు.
I am happy to inform that T Gopalakrishna (AP) & C BalaramKishan (Telangana) who were captive in Libya since 29 July 2015 have been rescued.
— Sushma Swaraj (@SushmaSwaraj) September 15, 2016
కాగా గతేడాది జులై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అందులో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్కుమార్లను రెండు రోజుల్లోనే ఉగ్రవాదులు విడిచిపెట్టారు. కాగా కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన బలరాం కిషన్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను విడుదల చేయలేదు.
దీంతో వీరి కిడ్నాప్తో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడులను పలుమార్లు కలిసి తమ వారిని విడుదల చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తాము లిబియా దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని బందీల విడుదల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే చర్చలు ఫలించి వారిని ఉగ్రవాదులు విడిచిపెట్టారు. తమవారు సురక్షితంగా విడుదల కావటంతో బలరాం కిషన్, గోపీకృష్ణ కుటుంబ సభ్యులు సంబురాల్లో మునిగిపోయారు.
చాలా థ్యాంక్స్ సుష్మాజీ: కేటీఆర్ ట్వీట్
లిబియాలో ఉగ్రవాదుల చెర నుంచి ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు విడుదలైన వార్తను సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. సుష్మాకు కృతజ్ఞతలు చెబుతూ "థ్యాంక్స్ వెరీ మచ్ మేడమ్" అంటూ ట్వీట్ చేశారు. విషయం తెలుసుకున్న వీరి కుటుంబ సభ్యులు ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. తన భర్తను ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు గోపీకృష్ణ భార్య తెలిపారు.
Thanks very much madam. #Respect https://t.co/KGs7940yz6
— KTR (@KTRTRS) September 15, 2016