మరణం ఒడిలోకి:స్కూల్ బస్సు కింద పడి చిన్నారి...విద్యుత్ షాక్ తో బిటెక్ విద్యార్థి
Recommended Video
కర్నూలు:కర్నూలు జిల్లా గడివేములలో స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. సరదాగా అక్కలతో ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు పయనమైంది.
బిలకల గూడూరు గ్రామానికి చెందిన వెంటకరెడ్డి, ప్రవళిక దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ముగ్గురు పిల్లలున్నారు. వారి చిన్న కూతురు హన్సిక(2) శుక్రవారం తన పెద్దమ్మ కుమార్తెల వద్దకు వెళ్లింది. వారు గడివేముల లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాల బస్సు ఎక్కేందుకు వెళ్లిన వారితో పాటు చిన్నారి కూడా వెళ్లింది. బస్సు కదిలే సమయంలో ప్రమాదవశాత్తు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.
జరిగిన ప్రమాదంతో దిగ్బ్రాంతి చెందిన గ్రామస్థులు బస్సును నిలువరించి, డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుండగా కృష్ణాజిల్లా బందరు ఆదర్శనగర్ లో విద్యుత్ షాక్తో ఇంజనీరింగ్ విద్యార్థి షేక్ అన్సర్ మృతి చెందాడు. షేక్ అన్సర్ ఇంట్లో ఉన్నసమయంలో గ్రైండర్ తిరగటంలేదని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో దాన్ని తిప్పేందుకు ప్రయత్నించిన అన్సర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతడు కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు అన్సర్ బందరు ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.