కరోనా అప్డేట్ : ఏపీలో 20వేల పైచిలుకు కొత్త కేసులు... మరో 96 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 96 మంది కరోనాతో మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 1,10,571 కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరులో 2269 మంది,తూర్పు గోదావరిలో 2370 మంది,విశాఖపట్నంలో 2525 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 14 మంది కరోనాతో మృతి చెందారు. విశాఖలో 12 మంది మృతి చెందారు.
రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 7065 పడకలు అందుబాటులో ఉన్నాయని... ఇప్పటికే 6300 పడకలు కరోనా బాధితులతో నిండిపోయాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలోని వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రస్తుతం రద్దీ నెలకొంది. మొదటి డోసు వేయించుకున్నవారికి నిర్ణీత సమయంలో రెండో డోసు అందకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సినేషన్ కోసం వ్యాక్సిన్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తోపులాట సంఘటనలు కూడా చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో ఈ నెల 15 నాటికి 12.93లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. కానీ శుక్రవారం(మే 7) నాటికి కేవలం 5లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు.దీంతో రెండో డోసు తీసుకోవాల్సినవారు ఉదయాన్నే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో కొన్ని వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పోలీసులు పెట్టినా వారిని అదుపు చేయలేకపోతున్నారు.
వ్యాక్సిన్ కేంద్రాలకు వస్తున్న డోసులు వంద మందిలో కేవలం 20 మందికి మాత్రమే సరిపోతుంది.దీంతో క్యూ లైన్లలో నిలుచున్న వందలాది మంది నిరాశగా వెనుదిరుగుతున్నారు. వ్యాక్సిన్ అందకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.