coronavirus:అప్పుడు నెగిటివ్, ఇప్పుడు పాజిటివ్, 20 రోజుల తర్వాత రాజమండ్రిలో..
కరోనా వైరస్ సోకితే.. 14 రోజుల క్వారంటైన్ తర్వాత పరీక్ష చేస్తున్నారు. అప్పుడు నెగిటివ్ వస్తే ఇంటికి పంపిస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి వైద్య పరీక్షలు చేశారు. ఆ సమయంలో వారికి నెగిటివ్ వచ్చింది. కానీ 20 రోజుల తర్వాత పరీక్ష చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఆందోళన చెందారు. రాజమండ్రిలో ఒకరికి పాజిటివ్ రావడంతో... ఢిల్లీ వెళ్లొచ్చిన మిగతావారిని కూడా పిలిపించారు. వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు.
33 మందిలో ముగ్గురికి..
ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు తూర్పుగోదావరి జిల్లా నుంచి 33 మంది వెళ్లారు. తిరిగొచ్చాక వారికి పరీక్షలు చేయగా కేవలం ముగ్గురికే పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ సమయంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 30 మందిని ఇంటికి పంపించారు. ఎందుకైనా మంచిదని.. 20 రోజుల తర్వాత రాజమండ్రి సమీపంలో గల ఓ వ్యక్తికి పరీక్ష చేశారు. దీంతో అతనికి పాజిటివ్ వచ్చింది. మిగతా 29 మందిని కూడా పిలిపించి పరీక్షలు చేస్తున్నారు.
20 రోజుల తర్వాత..
20 రోజుల తర్వాత పరీక్ష చేయడంతో వైరస్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ చేస్తున్నారు. 14 రోజుల తర్వాత పరీక్ష చేశాక ఇంటికి పంపిస్తున్నారు. కానీ గతంలో నెగిటివ్ వచ్చినవారికి మళ్లీ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.
6 కేసులు...
రాజమండ్రిలో కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరింది. ఆ సంఖ్య తూర్పుగోదావరి జిల్లాలో 34కి చేరింది. ప్రతీ రోజు 2 నుంచి 6 కేసుల వరకు నమోదవుతున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోన్నా.. వైరస్ కేసులు మాత్రం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
Recommended Video