విజయనగరం జిల్లాలో దారుణం- 20 ఏళ్ల యువతి కాళ్లూ చేతులు కట్టేసి
విజయనగరం జిల్లాలో ఇవాళ ఓ దారుణం చోటు చేసుకుంది. దిశ చట్టం అమల్లోకి వచ్చిన రాష్ట్రంలో యువతులకు రక్షణ లేదని ఈ ఘటన నిరూపించింది. గుర్ల మండలంలో పోలీసు స్టేషన్కు సమీపంలోనే చోటు చేసుకున్న ఈ ఘటనపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీసు స్టేషన్కు ఎదురుగా ఉన్న తోటలో ఓ 20 ఏళ్ల యువతి తాళ్లతో కట్టేసి ఉండటాన్ని స్ధానికులు గుర్తించారు. అపస్మారక స్ధితిలో ఉన్న ఆమెను మొహంపై నీళ్లు చల్లి లేపారు. వివరాలు అడిగినా చెప్పలేకపోతుండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతి కావడం, పట్టపగలే తాళ్లతో కట్టేసి ఉండటంతో ఏం జరిగిందనే దానిపై ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్ధితి నెలకొంది.
చివరికి ప్రాధమిక విచారణలో ఈ యువతిది తెర్లాం మండలం లోచర్ల గ్రామంగా గుర్తించారు. ఆమె వద్ద నున్న వివరాల ఆధారంగా విజయనగరం ఎస్కే డిగ్రీ కళాశాలలో ఆమె చదువుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమె పేరు రమగా గుర్తించారు. ఆదివారం రాత్రి దుండగులు ఆమెను చేతులు, కాళ్లూ కట్టేసి అక్కడ పడేసినట్లు తెలుసుకున్నారు. మిగతా వివరాలు తేల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులకు వివరాలు అందించి రప్పించారు.