నవ్యాంధ్ర బాసర కోటప్పకొండలో బయటపడిన 200 ఏళ్ల నాటి దారి
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో 200 ఏళ్ల నాటి నడకదారి బయటపడింది. పూర్వీకుల ప్రకారం ఈ గుడికి మూడు ప్రధాన మార్గాలు ఉండేవని తెలుస్తోంది. అందులో ఒకటి సోపాన మార్గం కాగా, మరొకటి ఏనుగుల మార్గం. అయితే కాల క్రమంలో ఈ రెండు మార్గాలు మరుగున పడిపోయాయి.
ఆయా మార్గాల్లో చెట్లు పెరగటంతో కనుమరుగయ్యాయి. కొండ దిగువ నుంచి ఎగువకి స్వామి వారి సన్నిధికి తాగు నీటి పైపులైన్ పనుల్లో భాగంగా చెట్ల తొలగిస్తుండగా ఈ పురాతన మార్గం బయట పడింది. కాకతీయ సత్రం వెనుక భాగం నుంచి కొండ ఎగువున బస్షెల్టర్ నిర్మించిన ప్రాంతం వరకు మార్గం ఉండేదని పూర్వీకులు అంచనా.
ఆ రోజుల్లో రాళ్లను పేర్చి ఈ మార్గాన్ని నిర్మించారు. దీనిని తమ పూర్వీకులు రాధాకృష్ణ సోపాన మార్గమని చెపుతుండేవారని ఆలయ ప్రధాన అర్చకులు అప్పయ్య శాస్త్రి తెలిపారు. ఈ మార్గాన్ని 500 ఏళ్ల కిందటే నిర్మించి ఉంటారని ఆయన తెలిపారు. స్వామి సన్నిధికి పూజా ద్రవ్యాలు తదితర సామగ్రిని ఏనుగుల ద్వారా ఈ మార్గంలోనే చేరవేసేవారంట.
అంతేకాదు ఏనుగులు కొండ పైకి వెళ్లేందుకు ప్రస్తుతం డీఆర్డీఏ శిక్షణ కేంద్రం వెనుక భాగం నుంచి కొండ పైన ఉన్న శివలింగం ప్రాంతం వరకు దారి ఉండేదని పూర్వీకులు చెప్పేవారని అర్చకులు తెలిపారు. ఇప్పుడు ఈ మార్గం కూడా పూర్తిగా కనుమరుగైంది.
నరసరావుపేట జమీందారులైన మల్రాజుల హయాంలో ప్రస్తుతం భక్తులు వినియోగిస్తున్న మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఇప్పుడు ఘాట్ రోడ్డు నిర్మాణంతో కాలి నడకన స్వామి సన్నిధికి వెళ్ళే వారి సంఖ్య భారీగా తగ్గింది. ఎవరైతే భక్తులు మొక్కులు మొక్కుంటారో వారు మాత్రమే మెట్ల మార్గం గుండా స్వామివారి సన్నిధికి వస్తున్నారు.
అయితే, ప్రస్తుతం బయట పడ్డ పూర్వ కాల సోపాన మార్గం కొండ సగం వరకు నడిచేందుకు వీలుగానే ఉంది. కొండ పైన విస్తరణ పనులతో బయటపడ్డ రాళ్లు, మట్టిని సోపానమార్గం వైపు తరలించారు. దీంతో ఈ మార్గం కొంత మేరకు పూడి పోయిందన్నారు. ఇది ఏ కాలంలో నిర్మించారనే అంశంపై పురావస్తు శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం బయటపడ్డ ఈ సోపాన మార్గంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటప్పకొండను మరో బాసరగా ప్రకటించింది. దీంతో గతేడాది కాలం నుంచి ఏపీలోని ప్రజలు చాలా మంది ఇక్కడే సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహిస్తున్నారు.