చూద్దాం: చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ అందలేదా? సీఎం ఏం చేస్తారు?
అమరావతి: 2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసులో మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా 16 మందికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులు ఇంకా చంద్రబాబుకు అందలేదని తెలుస్తోంది. ఈ నోటీసులు శనివారం వరకు అందలేదని సమాచారం.
అరెస్ట్ వారెంటు జారీ అయిన వ్యక్తి ఇతర రాష్ట్రంలో ఉంటే అక్కడి పోలీసులు ఆ వ్యక్తి ఉన్న రాష్ట్రంలోని పోలీసులకు ఈ విషయం తెలియజేస్తారు. సాధారణంగా కోర్టు ఆదేశం మేరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్ణయించిన తేదీన ఆ కోర్టులో హాజరుపరచాలి.
అరెస్ట్ వారెంట్లో ట్విస్ట్, నోటీసులిస్తే స్పందించని బాబు: వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా?
చంద్రబాబు విషయంలో ఏం జరుగుతుంది?
సదరు వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటే అరెస్ట్ దాకా వెళ్లకుండా సంబంధిత కోర్టుకు ఆ తేదీన హాజరై వారెంటును కొట్టి వేయించుకునే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ వ్యక్తి తరపు లాయర్ కోర్టుకు హాజరై వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతారు. ఇవి సాధారణంగా జరిగే వ్యవహారాలు. చంద్రబాబు విషయంలో ఏం జరుగుతుందన్నది తెలియాల్సి ఉంది.
అధికారికంగా సమాచారం రాకుంటే
మహారాష్ట్ర కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంటు సమాచారం అధికారికంగా అందకపోతే ఏం చేయాలన్నదానిపై కూడా టీడీపీ నేతలు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అరెస్ట్ వారెంట్ పైన మీడియాలో రావడం వేరు, అధికారిక సమాచారం వేరు. అధికారిక సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదని అంటున్నారు.
గతంలో నోటీసులు రావడంపై
కాగా, 2010 బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో చంద్రబాబుకు గతంలోను నోటీసులు అందాయని, వాటిపై స్పందన లేనందునే ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందని చెబుతున్నారు. ఈ ఆరోపణలను టీడీపీ కొట్టి పారేస్తోంది. తమకు నోటీసులు ఇచ్చినట్లు వారి వద్ద ఆధారాలు ఉండాలని చెబుతున్నారు. రాజకీయ ఆరోపణలు సరికాదంటున్నారు. అసలు బాబ్లీ ప్రాజెక్టు కేసు పెండింగులో ఉన్న విషయమే తెలియదని అంటున్నారు.
నోటీసులు ఇచ్చే బాధ్యత పోలీసులది
కోర్టులో ఒక కేసుకు సంబంధించి జడ్జి విచారణ తేదీని నిర్ణయిస్తే అందులో నిందితులుగా ఉన్న వారికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అక్కడి పోలీసులదని, జడ్జిలది కాదని, జడ్జి నోటీసు ఇస్తారని, దానిని అందజేయాల్సిన పోలీసులు అని, ఆ పని వారు చేయలేదని అంటున్నారు. కాగా, వారెంట్ పైన వేచి చూద్దామని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.