ఫ్లాష్బ్యాక్ 2017: ఏపీలో జరిగిన ఘోర ప్రమాదాలివే, వేలాది కుటుంబాల్లో తీరని శోకం
అమరావతి: 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదాలు వందలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. వేలాది మంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. కొన్ని ప్రమాదాలు అజాగ్రత్త, నిర్లక్ష్యంతో జరగగా, మరికొన్ని అనుకోని విధంగా జరిగి... ఎన్నో ఆశలతో, ఊసులతో సాగుతున్న జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి.
ప్రముఖుల కుటుంబాల్లో విషాదం నింపిన హైదరాబాద్ రోడ్డు ప్రమాదాలు(పిక్చర్స్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017లో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో దాదాపు 10వేల మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గకపోవడం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశంగా మారింది.
విజయనగరంలో ఘోరం.. 39మంది మృతి
విజయనగరం జిల్లా సంవత్సర ప్రారంభనెల జనవరిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో రాయగఢ్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం(జనవరి21) రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్, రెండు స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 23 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరో 16 మంది ఆస్పత్రులకు తరలిస్తుండగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 39కు చేరింది. ఈ ప్రమాదం వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
బస్సు లోయలోపడి 17మంది మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ-మడకశిర మార్గంలో బుధవారం(జనవరి 7న) ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 84 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. మృతుల్లో 9 మంది విద్యార్తులున్నారు.
కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి
కృష్ణా జిల్లాలో మంగళవారం(ఫిబ్రవరి 28) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్కు చెందిన ఓల్వా బస్సు(ఏపీ02 టీసీ7146) కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది.
లారీ సృష్టించిన కల్లోలం: 15మంది మృతి
చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం(ఏప్రిల్ 21న) మధ్యాహ్నం లారీ బీభత్సం సృష్టించింది. భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తిరుమల నుంచి వెళుతుండగా..
కడప జిల్లాలోని దువ్వూరు మండలం కానగూడూరు వద్ద బుధవారం(మే31) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ మినీ ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చిన్నారితోపాటు ఐదుగురు మహిళల మృతి
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలంలో సెప్టెంబర్ రెండో వారంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొవ్వలి గ్రామం వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులు కృష్ణా జిల్లా మల్లవల్లికి చెందినవారు. మృతులను చిన్నాల లక్ష్మీ(61), కుమారి(50), సౌమ్యశ్రీ(2), సులోచన(60), విజయ(50), దేవి(23)గా గుర్తించారు.
ఆటోను ఢీకొన్న లారీ: ఆరుగురు మహిళల మృతి
తూర్పుగోదావరి జిల్లాలో శనివారం(అక్టోబర్ 28) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం మూడేకర్రు మహాలక్ష్మీనగర్ వద్ద శనివారం తెల్లవారుజామున లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళలే.
ఘోర పడవ ప్రమాదం: ప్రాణాలు కోల్పోయిన 22మంది
కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ఆదివారం(నవంబర్ 12న) ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో ఫెర్రీఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 22మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16మందిని అక్కడేవున్న జాలర్లు, స్థానికులు కాపాడారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా, అనుమతి లేని బోటును నడిపిన యజమాని కారణంగా 22మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాద ఘటన వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఏపీలో 2017లో సుమారు 10వేల మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రమాదాలతో ఎన్నో కుటుంబాల్లో తీరాని శోకాన్నే మిగిల్చింది. వచ్చే ఏడాది 2018 మాత్రం అందరికీ సకల శుభాలు మాత్రమే తెచ్చిపెట్టాలని కోరుకుందాం.