బడ్జెట్ లో సాగు నీటి ప్రాజెక్టులు:భారీ కేటాయింపులు కాదు...కోతలే...ఇదీ నిజం!
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నా...ఆచరణలో తాజా బడ్జెట్ కేటాయింపులను బట్టి అవి సకాలంలో పూర్తికావడం అసాధ్యమేనని సుస్పష్టం. కారణం ప్రస్తుత బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు చూస్తే...అంకెల గారడీనే తలపిస్తోంది తప్ప వాస్తవాలకు అనుగుణంగా లేవు.
ప్రస్తుత 2018-19 సంవత్సరానికి సాగునీటి ప్రాజెక్టులకు 16,978.23 కోట్లు కేటాయించాం. గత సంవత్సరం కన్నా ఇది 32 శాతం ఎక్కువ...ఇవీ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సాగునీటి ప్రాజెక్టుల గురించి చెప్పిన మాటలు. అయితే కాగితాలపై ఈ కేటాయింపులు ఘనంగా ఉన్న మాట వాస్తవమే...కానీ విశ్లేషించి చూస్తే నిజంగా జలవనరులశాఖకు దక్కింది మాత్రం నామమాత్రం కేటాయింపులే. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఎలాగంటే....
తాజా బడ్జెట్...సాగునీటి ప్రాజెక్టులు...
కేటాయింపులు తాజా బడ్జెట్ లో 16,978.23 కోట్ల రూపాయల కేటాయింపుల్లో ఒక్క పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం రూ. 9,994 కోట్లు. దానికి పోగా మిగిలింది రూ. 6 వేల కోట్లు మాత్రమే. మరి వీటితో ఎన్ని మిగతా ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు....ఎలా చేస్తారు?...ఎలా చేయగలుగుతారు?...ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ నిధులతో అన్ని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడం అసాధ్యం. మరోవైపు టిడిపి ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.
ఏఏ ప్రాజెక్టులు...పూర్తి చేయాలంటే?...
రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్న ప్రాజెక్టులు...గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి, వంశధార ఫేజ్-2 తదితర ప్రధాన ప్రాజెక్టులతోపాటు, గోదావరి- పెన్నా అనుసంధానం, మహేంద్రతనయ, గాలేరు -నగరి రెండోదశ, వెలిగొండ 1, 2 సొరంగాలు, వైకుంఠపురం బ్యారజ్, స్వర్ణముఖి- సోమశిల, మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, వేణుగోపాల్ సాగర్, తారకరామ తీర్థసాగరం, హీరమండలం ఇచ్ఛాపురం- సోంపేట, జీడిపల్లి బైరవానితిప్ప, మూపల్లి- కుప్పం, పాలేరు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఆల్తూరుపాడు మరో 25 వరకు చిన్నతరహా ప్రాజెక్టులున్నాయి. 100 రోజుల్లో 28 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయాలనేది ప్రభుత్వం భావన. కానీ వాస్తవంగా ఈ ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే 6 వేల కోట్లు ఏ మూలకు సరిపోవు. వేలాది కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. పైగా అనేక చోట్ల నిర్వాసితులకు ఇచ్చే పునరావాసం సమస్యగా పరిణమిస్తోంది.
రాయలసీమలో...ప్రాజెక్టుల తీరిది...
రాయలసీమను కరువు రహితంగా చేయడానికి అక్కడ అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం...ఆ దిశలో అక్కడి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరపలేదు. వాస్తవానికి గాలేరు- నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు రూ. 2500 కోట్లు అవసరమని జలవనరులశాఖ అంచనా వేయగా రూ. ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో 524.31 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ చెప్పిన విధంగా పూర్తయే అవకాశమే లేదు. అలాగే గాలేరు-నగరికి రూ. 845.15 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 430.21 మాత్రమే కేటాయించారు.
ఉతరాంధ్ర...కృష్ణా డెల్టా...కేటాయింపులు...
ఉత్తరాంధ్రలో ప్రధాన ప్రాజెక్టులు వంశధారకు గత సంవత్సరం బడ్జెట్లో రూ.54.82 కోట్లు కేటాయించి, ఈ బడ్జెట్ లో రూ.13.41 కోట్లు మాత్రమే కేటాయించింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తికావాలంటే దాదాపు రూ.3 వేల కోట్లు కావాల్సి ఉండగా...తాజాగా రూ.378 కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్ లో రూ.91.90 కోట్లు కేటాయించింది. దీనివల్ల భూసేకరణ మరింత జాప్యం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఇక కృష్ణా డెల్టా ఆధునికీకరణ కోసం 2016-17 బడ్జెట్లో 112.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అందులో పైసా కూడా ఖర్చు పెట్టలేదు. 2017-18 బడ్జెట్లో రూ.112.89 కోట్లు కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్లో రూ.01.10 కోట్లు మాత్రమే కేటాయించింది.
పోలవరం...అంకెల గారడీ...
ఇక సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన రూ.16 వేల కోట్లలో...పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.9,994 కోట్లు కేంద్ర ప్రభుత్వమే నాబార్డు నుంచి ఇస్తుందని, ఆ విధంగా చూస్తే ఈ ప్రాజెక్టులకు ఎపి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. 6వేల కోట్లే నని రైతు సంఘం నేతలు విశ్లేషిస్తున్నారు. కేటాయింపులు ఈ విధంగా ఉంటే రాయలసీమలోని వెలిగొండ, తెలుగుగంగ, ఉత్తరాంధ్రలోని సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నిస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు ఇంకా కేటాయింపులు మొదలేకాలేదు. రెండేళ్లలో రూ. 33 వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారు. పోలవరం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ముందుగా పూర్తిచేసినా రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులు పూర్తవకుండా ఆ నీటిని ఎక్కడికి తరలిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు...ఇదీ రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల పరిస్థితి.