Flash Back: టీడీపీ చరిత్రలోనే చీకటి అధ్యాయాన్ని లిఖించిన 2019 .. సంవత్సరమంతా ఎదురీతే
2019 టీడీపీ చరిత్రలోనే అత్యంత భయానకమైన సంవత్సరం . 2014 ఎన్నికల్లో ఏపీలో విజయం సాధించి అధికారంలో కొనసాగిన టీడీపీ 2019లో చావు దెబ్బ తిండి. ఊహించని విధంగా ఓటమి పాలయ్యింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది .1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని టీడీపీ 2019లో మూటగట్టుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. తీవ్ర విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. దేశంలోమళ్ళీ అధికారంలోకి నరేంద్రమోడీ రాకూడదని ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూడా చంద్రబాబు చావు దెబ్బ తినాల్సి వచ్చింది . దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలన .. టీడీపీకి గడ్డు కాలం
అటు కేంద్రంలో మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారం చేపట్టటంతో టీడీపీ ప్రతిష్ట మసకబారింది. 2౩ మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిన చంద్రబాబు నేటికీ కోలుకోలేకపోతున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ సమూలంగా లేకుండా చెయ్యాలనే లక్ష్యంతో పని చేస్తుంది. చంద్రబాబు టీడీపీ ని కాపాడటానికి , టీడీపీ నేతలకు అండగా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి.
టీడీపీ ఏర్పడిన నాటి నుండీ ఎన్నడూ లేని ఓటమి 2019లోనే
1982 మార్చ్ 29 న తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఐదుసార్లు విజయం సాధించిన టీడీపీ.. నాలుగు సార్లు ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఓడిన టీడీపీకి అప్పట్లో 90 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మరోమారు ఓటమి పాలైంది. అప్పుడు 47 సీట్లు మాత్రమే వచ్చాయి. 2009లో ఓడినా 90 సీట్లు వచ్చాయి. అప్పుడు రాష్ట్రం ఉమ్మడిగా ఉంది. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీకి ఇది తొలి ఓటమి.
టీడీపీ చరిత్రలోనే ఘోర పరాజయం
2019లో కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైన చారిత్రక ఓటమి . ఇప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే ఇంత ఘోర పరాజయం ఎప్పుడు ఎదురు కాలేదు. అలాంటి ఓటమిని ఈ ఏడాది టీడీపీ చవిచూసింది .ఇక, లోక్సభ విషయానికొస్తే మూడంటే మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక ఇదే సమయంలో రాజ్య సభ సభ్యులు అనూహ్యంగా బీజేపీలో చేరి టీడీపీని రాజ్యసభలో విలీనం చేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , గరికపాటి రాం మోహన్ రావులు బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు.
టీడీపీకి వలసల భయం... కేసులు, దాడులతో టెన్షన్
ఇక అప్పటి నుండి టీడీపీకి వలసల భయం పట్టుకుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు , టీడీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు వెరసి టీడీపీ రాష్ట్రంలో చాలా బలహీనం అయిపోయింది. వైసీపీని దీటుగా ఎదుర్కోటానికి టీడీపీ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. అంతే కాదు దాడులు , టీడీపీ నేతలపై కేసులు పెరుగుతున్న సమయంలో టీడీపీ నేతలకు భయం పట్టుకుంది.
కోడెల మరణం, పార్టీ ఫిరాయింపులు .. మసకబారిన టీడీపీ
కోడెల మరణం టీడీపీకి తీరని దెబ్బగా మిగిలింది. టీడీపీలో కొనసాగుతున్న నేతలు కూడా దిక్కు చూస్తున్న పరిస్థితి. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతానని ప్రకటించారు. ఇక ఇదే సమయంలో దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో అన్న టెన్షన్ ఒకవైపు, వైసీపీ ని దీటుగా ఎదుర్కోలేని టీడీపీ సైన్యం ఒకవైపు చంద్రబాబును నిద్దుర పోనివ్వటం లేదు. ఒకప్పుడు వెలుగు వెలిగిన టీడీపీ 2019లో ఊహించని విధంగా మసకబారింది. 2019 టీడీపీ చరిత్రలోనే చీకటి అధ్యాయం లిఖించింది.