Pawan Kalyan:బీఎస్పీ టూ బీజేపీ వయా కమ్యూనిస్టులు: 2020లో జాడలేని జనసేనాని..?
2020 సంవత్సరం ప్రతి ఒక్కరికీ చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కరోనావైరస్ విజృంభించడంతో దేశమంతా ఒక్కసారిగా నిలిచిపోయింది. అయితే అక్కడక్కడ రాజకీయ కార్యకలాపాలు మాత్రం కనిపించాయి. 2020 తెలుగు రాష్ట్రాలకు కూడా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. రాజకీయ నాయకులు కూడా చాలావరకు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాదులోని తన ఇంటికే పరిమితం కాగా... అప్పటి వరకు తన సినిమా షూటింగులో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఇక పవన్ కళ్యాణ్కు 2020 సంవత్సరం ఎలా జరిగిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
2020లో బీజేపీతో పవన్ పొత్తు
2020లో జనసేన అడ్రస్ ఏపీ రాజకీయాల్లోపెద్దగా కనిపించలేదనే చెప్పాలి. కరోనావైరస్తో లాక్డౌన్ అమల్లోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయితే 2020 ఏడాది ప్రారంభంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలతో కలిసి వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో రూటు మార్చారు. బీజేపీ పై ఘాటు విమర్శలు సంధించిన పవన్.. 2019లో బీఎస్పీ కమ్యూనిస్టులతో బరిలోకి దిగారు. సీన్ కట్ చేస్తే మళ్లీ 2020వ సంవత్సరంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ పొత్తుతో పవన్ కళ్యాణ్కు చాలా నష్టమని పలువురు విశ్లేషకులు కూడా చెప్పారు. అప్పటి వరకు రాజధాని రైతుల కోసం ఉద్యమిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఢిల్లీకి వెళ్లి పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు.
అక్కడే తన సొంత నిర్ణయంతో కాకుండా బీజేపీ లైన్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మార్చి చివరి వారం నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని తన ఇంటికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ట్విటర్ ద్వారా అభిమానులను, కార్యకర్తలను పలకరిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారు.
మోడీని అనుకరించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో చాలామంది ఆయన సన్నిహితులు పార్టీని వీడారు. ఇక బీజేపీ ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఏర్పడింది. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు కూడా బంద్ అవడంతో ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ పేరు కూడా వార్తల్లో వినిపించలేదు. ఇక చతుర్మాస దీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు రకాల గెటప్లలో కనిపించారు. ఆసమయంలో మోడీలా పవన్ వ్యవహరిస్తున్నారంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఒకసారి గెడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ మరోసారి పొడవాటి జుట్టుతో ప్రత్యక్షమయ్యారు. మరోసారి చెట్టుకింద కూర్చొని రాగి పాత్రతో కనిపించారు. ఇక చతుర్మాస దీక్ష సందర్భంగా నుదుటిపై నిలువాటి తిలకంతో అభిమానులకు కనిపించారు.
లాక్డౌన్ సమయంలో కనిపించని పవన్ జాడ
లాక్డౌన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని వీడి బయటకొచ్చారు కానీ... పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ట్విటర్పైనే పోస్టులు పెడుతుండటంతో ఆయనపై విమర్శలు చాలా వచ్చాయి. ఇక 2020లో ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జనసేనానిపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అని చెప్పడంతో నాగబాబు రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ పై నిప్పులు చెరిగారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని చెప్పి, అభ్యర్థులతో నామినేషన్లు కూడా వేయించి చివరి నిమిషంలో బీజేపీ చెప్పడంతో నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ నిలకడ లేని రాజకీయనాయకుడని అందుకే పార్టీని వీడామంటూ మాజీ జనసేన నాయకులు చెప్పుకొచ్చారు.
ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికకు కూడా బీజేపీ జనసేనకు పోటీ చేసే ఛాన్స్ ఇస్తుందా అంటే అదీ అనుమానమే అనే మాట వినిపిస్తోంది. సినిమాల పరంగా మంచి అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్... రాజకీయంగా మాత్రం అభిమానులను సంపాదించుకోలేకపోయారనేది వాస్తవమని విశ్లేషకులు చెబుతున్నారు.
సినిమాలతో ఇక పవన్ బిజీ
పవన్ కళ్యాణ్కు రాజకీయంగా 2020 పెద్దగా కలిసి రానప్పటికీ... సినిమాల పరంగా ఫర్వాలేదనిపించింది. ఇప్పటికే తాను నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి కావొస్తుండగా మరో సినిమాకు కూడా జనసేనాని కొబ్బరికాయ కొట్టాడు. ఇందులో రానా కూడా నటిస్తున్నాడు. అయప్పన్ కోషియం అనే మలయాళం సినిమాను రీమేక్ చేస్తున్నారు. అనంతరం క్రిష్తో ఓ సినిమా, గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్తో మరో సినిమా, బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమాకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇవన్నీ 2020 సంవత్సరంలోనే చర్చకు వచ్చాయి.
మొత్తానికి రీల్ లైఫ్ ఎంటర్టెయినర్గా ఉన్న పవన్ కళ్యాణ్... పొలిటీషియన్గా సీరియస్గా లేరని అందుకే రియల్ లైఫ్లో కూడా పెద్ద ఎంటర్టెయినర్గా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరి చేతిలో ఇన్ని సినిమాలు ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలో ఏమేరకు రానిస్తారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది హాట్టాపిక్గా మారింది.