దసరా స్పెషల్: 2028 స్పెషల్ సర్వీసులు.. 15 నుంచి 28 వరకు..
ఎప్పటిలాగే ఈ సారి కూడా దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అయితే బస్సుల రాకపోకలపై తెలంగాణ ఆర్టీసీతో చర్చలు కొలిక్కి రాలేని సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణకు తప్పా..మిగతా చోట్ల బస్సు సర్వీసులు నడుస్తాయి. విజయదశమి నేపథ్యంలో 2 వేల బస్సు సర్వీసులను నడిపించనున్నారు. ఇందుకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తిచేసింది.
ఈ నెల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బస్సు సర్వీసులను నడిపిస్తారు. పండగ సందర్భంగా.. ఫెస్టివ్ ముందు, పండగ ముగిసిన తర్వాత కూడా బస్సు సర్వీసులు నడుస్తాయి. ఇదివరకటి మాదిరిగా 2 వేల 28 బస్సులను నడిపిస్తారు. ఆ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కూడా చేసుకునే సదుపాయం కల్పించారు. ఒకవేళ ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తే మరిన్ని సర్వీసులను నడిపిస్తారు. రద్దీ ఉంటే ప్రత్యేక సర్వీసులను నడిపిస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు సంకేతాలను ఇచ్చారు.
తెలంగాణ ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. తెలంగాణలో ఏపీ బస్సులు ఎక్కువ తిరుగుతున్నందున.. కిలోమీటర్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు ముందుకు సాగడం లేదు. పాత విధానంతో తాము నష్టపోతామని తెలంగాణ ఆర్టీసీ చెబుతోంది. దీనిపై చర్చించేందుకు ఇరురాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల సమావేశం జరుగుతుందని షెడ్యూల్ చేసినా.. చివరి క్షణంలో మారిన సంగతి తెలిసిందే.