ఏపీలో కొత్తగా 203 కరోనా కేసులు: పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్కు పడిపోయిన కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 44,679 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 203 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,85,437కి చేరింది.
తాజా మరణంతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,134 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 231 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,75,921కి చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,24,41,272 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యశాఖ తెలిపింది.
ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. అనంతపురంలో 23, చిత్తూరులో 18, తూర్పుగోదావరిలో 27, గుంటూరులో 41, కడపలో 9, కృష్ణాలో 30, కర్నూలులో 5, నెల్లూరులో 2, ప్రకాశంలో 2, శ్రీకాకుళంలో 8, విశాఖపట్నంలో 22, విజయనగరంలో 9, పశ్చిమగోదావరిలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక, దేశ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటలల్లో దేశ వ్యాప్తంగా 8,36,227 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 1,01,29,111 మంది కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 17,817 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 202 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,51,529కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,507 యాక్టివ్ కేసులు ఉన్నాయి.