ఏపీలో 132కు చేరిన కరోనా పాజిటివ్: ఒకేసారి 21 కొత్త కేసులు: ఆ రెండు జిల్లాల్లో భీతావహం
అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అడ్డు, అదుపు లేకుండా పెరుగుతోంది. రెండు రోజుల్లో 37 కేసులు నమోదు కాగా.. 12 గంటల వ్యవధిలో కొత్తగా 21 పాజిటివ్ కేసులు తేలాయి. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 21 కేసులు వెలుగు చూసినట్లు నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన విడుదల చేశారు. రెండు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరో నాలుగు జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.
Recommended Video
ప్రయాణికులకు శుభవార్త: రైల్వే, విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ ఆరంభం: జర్నీ ఎప్పట్నుంచంటే..!
నెల్లూరు, గుంటూరుల్లో భీతావహం
రాష్ట్రంలో నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కొన్ని గంటల వ్యవధిలో 40 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ కేసు నమోదైన నెల్లూరు జిల్లాలో 12 గంటల వ్యవధిలోనే 20 కేసులు నమోదు అయ్యాయి. తొలి పాజిటివ్ కేసు నమోదైన తరువాత మళ్లీ ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోవడం ఇదే తొలిసారి. గుంటూరు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి
10 జిల్లాల్లో 1800 మందికి పరీక్షలు..
రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహాయిస్తే.. అన్ని జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కలిపి మొత్తం 1800 మందికి ఆయా జిల్లాల వైద్యాధికారులు రక్త పరీక్షలను నిర్వహించారు. వాటి నమూనాలు దశలవారీగా అందుతాయని ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ 1800 మందిలో 132 కేసులు పాజిటివ్గా వచ్చాయని, 493 మందికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉందని అన్నారు. మిగిలిన 1175 మంది నివేదికలు నెగెటివ్గా వచ్చాయని చెప్పారు.
కొత్త కేసులు నమోదు కాని ఆ నాలుగు జిల్లాలు..
కడప, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. కృష్ణాలో-15, కడప-15, అనంతపురం-2, కర్నూలులో ఒక కేసులు ఇదివరకే నమోదు అయ్యాయి. కొత్తగా నమోదైన 21 కేసుల జాబితాలో ఈ నాలుగు జిల్లాలు లేవు. ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కొత్త కేసులు బహిర్గతం అయ్యాయి. ఇంకా 493 మందికి నిర్వహించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉన్నందున.. పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించే అవకాశాలు లేకపోలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.