ఏపీలో 210 మండలాల్లో వడగాలులు : జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సూచన
అమరావతి : తెలుగురాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తోన్నాయి. భానుడి భగభగలతో జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 8 దాటితే ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్పా .. బయటకు వెళ్లడం లేదు. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో .. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
210 మండలాల్లో ..
ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో రియల్ టైం గవర్నెన్స్ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోని 210 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. దీంతో చిన్నారులు, వృద్దులు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మరో 4 రోజుల ఇలాంటి పరిస్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది.
పెరిగిన ఎండలు
ఆదివారంతో పోలిస్తే సోమవారం ఎండల తీవ్రత పెరిగినట్టు ఆర్టీజీఎస్ తెలిపింది. ఎండల తీవ్రత పెరగడంతో సరైన జాగ్రత్తలు తీసుకొని .. బయటకు రావాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో అలర్ట్ గా ఉండాలని ప్రత్యేకంగా సజెస్ట్ చేసింది.
నెల్లూరులో 45 డిగ్రీలు
ఇక నిన్న ఏపీలో పలు పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. నెల్లూరులో 45 డిగ్రీలు, కృష్ణా జిల్లా తిరువూరులో 44, విశాఖ జిల్లా అనంతగిరిలో 30 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా గారలో 32 డిగ్రీలు, అనంతపురం జిల్లా గుదిబండలో 32 డిగ్రీలు, కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు పేర్కొన్నారు.